Indian Airlines: ఒకే రోజు నాలుగు ఫ్లైట్స్ ఇష్యూస్.. ప్రయాణకులను ఎక్కించుకోకుండానే వెళ్లిపోయిన విమానం..
Indian Airlines: రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో ఫ్లైట్ సిబ్బందితో కలిపి 236 మంది ఉండగా.. గుజరాత్లోని జామ్నగర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో ఫ్లైట్ సిబ్బందితో కలిపి 236 మంది ఉండగా.. గుజరాత్లోని జామ్నగర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందర్నీ దించేసి తనిఖీలు చేశారు. మరోచోట.. టేకాఫ్ అయిన వెంటనే ఓ ఫ్లైట్లో సాంకేతిక సమస్య గుర్తించారు. ఇంకోచోట ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయింది. ఇండిగో ఫ్లైట్లో ప్యాసింజర్లలతో అసభ్యంగా ప్రవర్తించారంటూ మరో రచ్చ. ఇదిలాఉంగా తమ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించలేదంటూ ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఇలా ఒకేరోజు వందల మందిని కంగారు పెట్టించిన ఆ వరుస ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు..
రష్యాలోని మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అలర్ట్ అయిన అధికారులు.. ఫ్లైట్ను గుజరాత్కు మళ్లించారు. జామ్నగర్లో ఫ్లైట్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాదాపు 236 ప్రయాణికులు ఉండగా.. వారందరినీ కిందకు దించి తనిఖీలు చేశారు. చివరకు ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ- భువనేశ్వర్ ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్..
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళుతున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన వెంటనే తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సమస్య పరిష్కారం అనంతరం విమానం మళ్లీ కదిలింది.




ఇండిగో విమానంలో రచ్చ..
ఇండిగో విమానంలో గొడవ జరగడం సంచలనంగా మారింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఈ విషయం పెద్ద ఇష్యూ అయ్యింది. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది ఇండిగో. తమ విమానంలో ఎలాంటి ఘర్షణపూరిత ఘటనలు జరగలేదని తెలిపింది ఇండిగో యాజమాన్యం. మద్యం మత్తులో ప్రయాణికులు.. సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ప్రయాణికులను ఎక్కించుకోకుండానే గోఫస్ట్..
ఇది మరో విచిత్రమైన కేసు. బెంగళూర్ నుంచి ఢిల్లీ వెళ్లిన గో ఫస్ట్ ఎయిర్వేస్కి చెందిన విమానం 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా వదిలి వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




