రోజుకు రూ. 100 కోట్లు స్వాధీనం.. చరిత్రలో రికార్డు దిశగా ఈసీ రూ.4650 కోట్ల రికవరీలు..

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. వాటిని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి మొదలుపెట్టి మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది.

రోజుకు రూ. 100 కోట్లు స్వాధీనం.. చరిత్రలో రికార్డు దిశగా ఈసీ రూ.4650 కోట్ల రికవరీలు..
Election Commission
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 15, 2024 | 12:39 PM

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. వాటిని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి మొదలుపెట్టి మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలో జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిరోజూ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల రూపంలో రికవరీ జరుగుతోంది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొత్తం రూ. 4,650 కోట్ల విలువైన రికవరీ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర రికవరీ జరుగుతోంది. పార్లమెంట్‌కు జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అన్నికల్లో ఇది అత్యధిక మొత్తంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో నగదు రూపంలో రూ. 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా, బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు రికవరీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. అలాగే మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువచేసే 3.58 కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదకద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం జరిగిన రికవరీల్లో రూ. 2,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే.. రికవరీల్లో సింహభాగం (45% ) వాటా మాదకద్రవ్యాలదే అని అర్థమవుతోంది. ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని వివరించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) మొత్తం కలిపి ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3,475 కాగా, ఆ రికార్డును ఈసీ ఇప్పటికే అధిగమించి దూసుకెళ్తోంది. జూన్ 1తో ముగియనున్న 7 విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఊహకే అందడం లేదు. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వేటే..

ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేయడం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా పోతాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థులకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేలా చూడడం కోసం ఈసీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చింది. ఎన్నికల అవకతవకలపై గతంలో ఎదురైన అనుభవాలు, ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసి తాము చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫేజ్-1 ఎన్నికల కోసం నియమించిన కేంద్ర పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్లు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనేకాంశాలపై లోతుగా చర్చించారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించడానికే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ఈ క్రమంలో కఠినంగా తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సహా ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోడానికి ఈసీ ఏమాత్రం వెనుకాడడం లేదు. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఓ ప్రముఖ నేత కాన్వాయ్‌ను తనిఖీ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించినందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌పై ఈసీ వేటు వేసింది. ఒక రాష్ట్రంలో సీఎం కాన్వాయ్, మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను తనిఖీ చేయకుండా వదిలేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అలా ఇప్పటి వరకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కీలకంగా మారిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్..

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ECMS) దేశవ్యాప్తంగా తనిఖీలు, రికవరీల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తద్వారా సమన్వయంతో ఎన్నికల అధికారులు, బృందాలు పనిచేయగల్గుతున్నాయి. ఈ సిస్టం పరిధిలో 6,398 వేర్వేరు విభాగాలకు చెందిన జిల్లా నోడల్ అధికారులు, 734 మంది రాష్ట్ర నోడల్ అధికారులు, 59,000 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఉన్నాయి. ఈ సిస్టమ్‌ను ఉపయోగించడంపై నోడల్ ఆఫీసర్లకు ముందస్తుగా ఈసీ శిక్షణ ఇచ్చింది. దీన్ని 2023 నుంచే అమల్లోకి తీసుకురాగా.. ఆ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 2014.26 కోట్ల మేర సొమ్ము, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకోగలిగింది. ఈ క్రమంలో నగదు, బంగారం వంటి విలువైన లోహాల అక్రమ రవాణాపై కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్‌కం ట్యాక్స్ (IT), రాష్ట్ర పోలీసులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED), పోస్టల్ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వంటి సంస్థలు పనిచేస్తుండగా, మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీసులు, ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ విభాగం అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఇలా అనేక దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలను ఎన్నికల విధుల్లో వినియోగిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్నీ వదిలిపెట్టకుండా కఠినంగా నిఘా అమలు చేస్తున్నట్టు ఈసీ వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుంచీ ఈ రికవరీలు జరుగుతుండగా.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ. 12,000 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, బహుమతులను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ సీ-విజిల్ ఇందులో కీలకపాత్ర పోషించింది. ప్రజల భాగస్వామ్యంతో 3,262 ఫిర్యాదులతో నగదు, మద్యం, ఉచిత బహుమతులను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వివరించింది.

రికవరీల్లో రాజస్థాన్, గుజరాత్ టాప్..

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?