AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh: నాలుగు రోజులుగా పరారీలోనే అమృత్‌పాల్‌.. దొడ్డి దారిన కెనడా వెళ్లేందుకు ప్రయత్నాలు!

Amritpal Singh: పరారీలో ఉన్న అమృత్‌పాల్‌సింగ్ కోసం వరుసగా నాలుగో రోజు పంజాబ్‌ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు ఇప్పటికి పలువురు వారిస్‌ పంజాబ్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.

Amritpal Singh: నాలుగు రోజులుగా పరారీలోనే అమృత్‌పాల్‌.. దొడ్డి దారిన కెనడా వెళ్లేందుకు ప్రయత్నాలు!
Amritpal Singh
Balaraju Goud
|

Updated on: Mar 21, 2023 | 4:05 PM

Share

అమెరికా , బ్రిటన్‌లో అమృత్‌పాల్‌ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాలను టార్గెట్‌ చేయడంపై అటు కేంద్రం గుర్రుగా ఉంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం అయా దేశాలను కోరింది. మరోవైపు, ఖలిస్తాన్‌ మద్దతుదారుడు అమృత్‌పాల్‌సింగ్‌ వెనుక పాకిస్థాన్‌ నిఘా సంస్థ హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అమృత్‌పాల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ ముఠాలే మెర్సిడెజ్‌ బెంజ్ కారును సింగ్‌కు బహుమతిగా ఇచ్చాయనీ, ఆయుధ సహకారాన్ని ఐఎస్‌ఐ అందిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఛేజింగ్ లో తప్పించుకున్నప్పుడూ కూడా ఇదే కారులో సింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుడికి ఓ ప్రైవేటు సైన్యం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే,ఐదుగురు వ్యక్తులపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. అమృత్‌పాల్‌కు మద్దతుగా పలువురు డ్రగ్స్‌ పెడ్లర్ల కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రైవేట్‌ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అమృత్‌పాల్‌ ప్రధాన అనుచరుడి ఖాతాలకు రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. ఇదిలావుండగా భారత్‌ నుంచి తప్పించుకుని కెనడా వెళ్లడానికి అమృత్‌పాల్‌ భార్య వీసాకు అప్లై చేసుకుంది. దీంతో అమృత్‌పాల్‌ కూడా కెనడా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, పరారీలో ఉన్న అమృత్‌పాల్‌సింగ్ కోసం వరుసగా నాలుగో రోజు పంజాబ్‌ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు ఇప్పటికి పలువురు వారిస్‌ పంజాబ్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అటు అమృత్‌పాల్‌సింగ్‌ వ్యవహారంపై పంజాబ్‌ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. దేశ భద్రతకు ముప్పుగా మారిన అమృత్‌పాల్‌సింగ్‌ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. అతడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, విడుదల చేయాలంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.ఎస్‌.షెకావత్‌ విచారణ చేపట్టారు. అయితే, అమృత్‌పాల్‌ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు.

మరోవైపు.. అమృత్‌పాల్‌ సింగ్‌పై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించామని పంజాబ్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఐదు క్రిమినల్ కేసుల్లో అతని పాత్రపై విచారణ జరుగుతోందని కోర్టు వివరించింది. కాగా, ఇప్పటికే అమృత్‌పాల్‌ పంజాబ్ సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..