గోవా ఆసుపత్రిలో 26 మంది కోవిడ్ రోగుల మృతి, హైకోర్టు దర్యాఫ్తునకై ఆరోగ్య మంత్రి సూచన, శ్వేత పత్రం విడుదల చేయాలని అభ్యర్థన
గోవాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 26 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఇందుకు సరైన కారణాన్ని తెలుసుకునేందుకు స్వయంగా హైకోర్టు దర్యాప్తు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే కోరారు.
గోవాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 26 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఇందుకు సరైన కారణాన్ని తెలుసుకునేందుకు స్వయంగా హైకోర్టు దర్యాప్తు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే కోరారు. నిన్న తెల్లవారు జామున 2 గంటలు, ఈ ఉదయం 6 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయని కానీ, ఇందుకు కచ్చితంగా కారణాలు తెలియడంలేదని ఆయన అన్నారు. సోమవారం మాదిరే ఈ రోజు కూడా మెడికల్ ఆక్సిజన్ సమయానికి అందకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఏమైనా హైకోర్టు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, జోక్యం చేసుకోవడమే కాకుండా ఓ శ్వేత పత్రాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ విధమైన పరిణామాలు సంభవించకుండా చూడగలమన్నారు. అసలు ఆక్సిజన్ సరఫరాపై ఇలాంటి శ్వేత పత్రం ఉండాలన్నారు. ఈ ఆసుపత్రిని సందర్శించిన సీఎం ప్రమోద్ సావంత్ ..మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ ఆక్సిజన్ లభ్యతకు, కోవిడ్ వార్డులకు దీని సరఫరాకు మధ్య జాప్యం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ జాప్యమే రోగుల మృతికి దారి తీసి ఉండవచ్ఛునన్నారు. ఏమైనా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ హాస్పిటల్ కి మాత్రం సకాలంలో ప్రాణవాయువు అందలేదని ప్రాథమికంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.నిన్న ఈ హాస్పిటల్ కు 1200 జంబో సిలిండర్లు అందాల్సి ఉండగా 400 మాత్రమే అందినట్టు ఆయన చెప్పారు. ఇక్కడ కోవిడ్ రోగుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ముగ్గురు నోడల్ ఆఫీసర్లను నియమించామని, వారు ఓ కమిటీగా వ్యవహరించి తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని ఆయన వివరించారు.కాగా-ఇంతమంది రోగులు మరణిస్తే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి ఇదేదో సాధారణ విషయంగా మాట్లాడడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral video: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం.. ( వీడియో )