అటు రాయపాటి..ఇటు జేసీ.. దేశం నేతలు ఉక్కిరిబిక్కిరి

ఒకపక్క రాయపాటి సాంబశివరావు.. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి.. సీబీఐ దాడులు ఒకవైపు.. ఆర్టీఏ సీజులు మరోవైపు.. ఇద్దరు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నాది కాదు.. ఇప్పుడు నాకందులో ఏ బాధ్యతా లేదని మొత్తుకుంటున్నా సీబీఐ వినడం లేదు. ఆధారాలతో రాయపాటిని అతలాకుతలం చేస్తోంది. సోమ, మంగళవారం ఆకస్మిక దాడులతో రాయపాటిని, ఆయన కుటుంబీకులకు చెమటలు పట్టించింది సీబీఐ. మరోవైపు రెండు నెలల క్రితం సీజ్ అయిన బస్సులను ఎలాగోలా కోర్టు […]

అటు రాయపాటి..ఇటు జేసీ.. దేశం నేతలు ఉక్కిరిబిక్కిరి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2019 | 7:58 PM

ఒకపక్క రాయపాటి సాంబశివరావు.. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి.. సీబీఐ దాడులు ఒకవైపు.. ఆర్టీఏ సీజులు మరోవైపు.. ఇద్దరు టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నాది కాదు.. ఇప్పుడు నాకందులో ఏ బాధ్యతా లేదని మొత్తుకుంటున్నా సీబీఐ వినడం లేదు. ఆధారాలతో రాయపాటిని అతలాకుతలం చేస్తోంది. సోమ, మంగళవారం ఆకస్మిక దాడులతో రాయపాటిని, ఆయన కుటుంబీకులకు చెమటలు పట్టించింది సీబీఐ. మరోవైపు రెండు నెలల క్రితం సీజ్ అయిన బస్సులను ఎలాగోలా కోర్టు ఆదేశాలతో తిరిగి తెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ఆర్టీఏ అధికారులు మంగళవారం మరోసారి షాకిచ్చారు. జేసీ బ్రదర్స్‌కు చెందిన ఆరు బస్సులను మళ్ళీ సీజ్ చేశారు. దేశం నేతలే టార్గెటా? లేక వారి వ్యాపారాల్లోనే లొసుగులున్నాయా? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది.

బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆఫీసులపై సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్‌ట్రాయ్ ఆఫీసుతోపాటు.. రాయపాటి కార్యాలయంలో తనిఖీలు ముందుగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గుంటూరు, బెంగళూరులోనూ తనిఖీలు కొనసాగాయి. యూనియన్ బ్యాంకు కన్సార్షియంతోపాటు ఇండియన్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు. ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు రాయపాటి సాంబశివరావు. ఈ విషయంలో రాయపాటి బ్యాంక్‌ను మోసం చేశారంటూ రాయపాటిపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది.

రాయపాటి సాంబశివరావు ఫౌండర్ ప్రమోటర్ చైర్మెన్‌గా వ్యవహరించిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ యూనియన్ బ్యాంకు లీడ్ బ్యాంకుగా వున్న బ్యాంకుల కన్సార్షియం నుంచి 2013లో తీసుకున్న 264 కోట్ల రూపాయల రుణం, దాని తాలూకు వడ్డీ మొత్తానికి సంబంధించి హైదరాబాద్ సీబీఐలో ఫిర్యాదు దాఖలైంది. దీని విచారణకు ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న చెరుకూరి శ్రీధర్ గానీ, అంతకు ముందు ఫౌండర్ ప్రమోటర్ ఛైర్మెన్‌గా వుండి ప్రస్తుతం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సాంబశివరావు గానీ సహకరించడం లేదని యూనియన్ బ్యాంకు సీబీఐకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి హైదరాబాద్ కావూరి హిల్స్‌ కార్యాలయంతోపాటు బెంగళూరు, గుంటూరు నగరాల్లోని ట్రాన్స్‌ట్రాయ్ ఆఫీసులలో దాడులకు సీబీఐ అధికారులు శ్రీకారం చుట్టారు. గుంటూరులోని రాయపాటి నివాసంపైనా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. సేకరించిన సాధారణ సమాచారంతో ఎఫ్ఐఆర్ రూపొందించారు సీబీఐ అధికారులు.

FIR AGAINST RAYAPATI’S TRANSTROY

అయితే గుంటూరు ఆఫీసులో రాయపాటి చాంబర్‌లో వున్న లాకర్ అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. దాని తాళంచెవి తమ దగ్గర లేదని రాయపాటి కుమారుడు చెప్పడంతో అందులో ఏదో రహస్యముందని అందరూ భావించారు. దానికి సంబంధించి రాయపాటి కుమారుడిని ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతోపాటు కీస్ హైదరాబాద్‌లో వున్నాయంటూ రాయపాటి కుమారుడు సమాధానమివ్వడంతో సీబీఐ అధికారులు మరింత పట్టుదలకు పోయారు. దాంతో హైదరాబాద్‌లో వున్న రాయపాటి సాంబశివరావు.. హుటాహుటిన తన వద్ద వున్న లాకర్ తాళం చెవులను గుంటూరుకు పంపించారు. దాంతో ఆ లాకర్‌ను కూడా సీబీఐ అధికారులు తెరిచారు. దాంతో ఉత్కంఠకు తెరపడింది.

లాకర్‌లో ఉన్న పలు పత్రాలను పరిశీలించిన సీబీఐ అధికారులు.. వాటికి సంబంధించిన వివరాలను కుటుంబీకుల నుంచి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అవే పత్రాలకు సంబంధించి రాయపాటి సాంబశివరావును వేరుగా ప్రశ్నించి సమాచారం సేకరించారు అధికారులు. ఈ దర్యాప్తు కొనసాగుతుందని సిబిఐ అధికారులు తెలియజేశారు.

మరోవైపు అనంతపురం దిగ్గజ రాజకీయ వేత్త, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌పై ఏపీ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన ఆరు బస్సులు సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిజానికి దివాకర్ రెడ్డికి వరుసగా దెబ్బలు తగులుతూనే వున్నాయి.

రెండు నెలల క్రితం దాడులు నిర్వహించిన ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 26 బస్సులను సీజ్ చేశారు. దాంతో జేసీ బ్రదర్స్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన బస్సుల్లో 18ని విడుదల చేశారు. తాజాగా కల్యాణదుర్గం, హిందూపురం, అనంతపురంలలో దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరు బస్సులను సీజ్ చేసి, మరో రెండింటి పేపర్లను పరిశీలిస్తున్నారు.