Farmer Success Story: వరి సాగులో ప్రయోగాల ఘణుడు.. శాస్త్రవేత్తగా మారిన సామాన్య రైతు

Farmer Success Story: . వివిధ రాష్ట్రాల్లో విడుదలైన వరి రకాలను సేకరించి సాగుచేస్తాడు. పలు రకాలను సంకరించి నూతన రకాలను సృష్టిస్తాడు. నిత్యం వరిలో ప్రయోగాలు చేస్తూ రైతు శాస్త్రవేత్తగా మారిపోయాడు.

Farmer Success Story: వరి సాగులో ప్రయోగాల ఘణుడు.. శాస్త్రవేత్తగా మారిన సామాన్య రైతు
New Varieties Of Paddy Farm
Follow us

|

Updated on: May 12, 2021 | 7:35 PM

వరి సాగులో ప్రయోగాల ఘణుడు.. వివిధ రాష్ట్రాల్లో విడుదలైన వరి రకాలను సేకరించి సాగుచేస్తాడు. పలు రకాలను సంకరించి నూతన రకాలను సృష్టిస్తాడు. నిత్యం వరిలో ప్రయోగాలు చేస్తూ రైతు శాస్త్రవేత్తగా మారిపోయాడు. తన వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఈ రైతు చేస్తున్న ప్రయోగాలు ఏంటీ..? ఆయన పండిస్తున్న వరి రకాలు ఏంటీ.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లాకు పోవాల్సిందే.. వ్యవసాయ క్షేత్రాన్ని… మడులు.. మడులుగా చేసుకున్నాడు.  అన్ని మడుల్లో ఒకే రకం వరిని కాకుండా.. ఇందులో దాదాపు 350 రకాలు వరిని సాగు చేస్తున్నాడు. ఇది ఎక్కడో కాదు పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండలం, కిష్టంపేట గ్రామంలో ఉంది. 20 ఏళ్లుగా నూతన వరి రకాలను సాగుచేస్తూనే ఉన్నాడు అభ్యుదయ రైతు కొప్పుల సత్యనారాయణ.

రైతు సత్యనారాయణది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయపై ఉన్న మక్కువతో 10 వ తరగతితోనే చదువు ఆపేశాడు. 2000 సంవత్సరం నుండి తనకున్న 8 ఎకరాల్లో వరిసాగుచేస్తున్నాడు. అందరిలా వరి సాగుచేస్తే ఏముంది అనుకున్నాడేమో… వివిధ పరిశోధనా స్థానాలు రూపొందించిన నూతన వంగడాలను.. మినికిట్ దశలో సేకరించి, ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఉన్నాడు . ఒకే క్షేత్రంలో ఆర్.ఎన్.ఆర్ 15048, ఐ.ఐ.ఆర్.ఆర్. 93 ఆర్, కె.ఎన్.ఎం 118, కె.ఎన్.ఎం – 1638, ఎం.టి.యు – 1290, ఎంటియు 1271, మహేంద్ర, వెంకటాద్రి, కెపిటి గోల్డ్ తో పాటు పలు దేశీ రకాల సాగుతో తన వ్యవసాయ భూమిని ఏకంగా ప్రయోగాలకు వేదికగా మార్చాడు.

అతి తక్కువ ఎరువులతో మంచి దిగుబడులను తీస్తున్నారు ఈ రైతు. అంతే కాదు చీడపీడలను తట్టుకొని, అధిక దిగుబడులు వచ్చే రకాలను అభివృద్ధి పర్చుతున్నారు. ఇప్పటికే జైశ్రీరాం, బిపిటి రకాల సంకరనంతో నూతన రకాన్ని రూపొందించారు. దాని పేరే కేటిపి గోల్డ్. దీనినే కిష్టంపేట సన్నాలు అనికూడా అంటారు. గింజ నాణ్యంగా ఉండి అధిక దిగబడి వస్తోందని సత్యనారాయణ అంటున్నాడు.

చుట్టుప్రక్కల రైతులు రైతు సత్యనారాయణ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. అయితే దిగుబడి బాగా వస్తుండటంతో, మళ్లీ కొత్తరకాలను వేసేందుకు విత్తనం కోసం వస్తున్నారు. అంతే కాదు తోటి రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు ఇస్తున్నాడు .

తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చనే దానికి నిదర్శనమే రైతు సత్యనారాయణ. ఇరవై ఏళ్లుగా వరిసాగులో అనుభం గడించి, నూతన వంగడాలను రూపొందిస్తూ… తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు..

ఇవి కూడా చదవండి: Lockdown: తెలంగాణలో మొదలైన లాక్‌డౌన్… నిర్మల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకున్న మంత్రి

Telangana Lockdown: ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..