L2 : Empuraan: మోహన్ లాల్ ఎల్ 2: ఎంపురాన్ వివాదం.. చిత్ర బృందం సంచలన నిర్ణయం.. ఏకంగా..
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టా్ మోహన్ లాల్ నటించిన చిత్రం 'L2 ఎంపురాన్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దీంతో నటుడు మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పాడు.

మోహన్ లాల్ ‘ ఎల్2 :ఎంపురాన్’ గత శుక్రవారం (మార్చి 28) విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేరళలోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ ఆదరణ లభించింది. ఇప్పటివరకు కేరళలో మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అయితే కొన్ని మితవాద సంఘాలు, పార్టీలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఒక ప్రముఖ పార్టీ నాయకుడు ఈ సినిమాపై కోర్టుకు కూడా వెళ్లాడు. ఎంపురాన్ సినిమాపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో మోహన్ లాల్ కూడా క్షమాపణలు చెప్పాడు. కాగా వివాదం తీవ్రమవుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఎంపురాన్’ సినిమాలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఓ వర్గాన్ని కించ పరిచే సన్నివేశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ సినిమాలో బాబా అనే వ్యక్తి గర్భిణీ ముస్లిం మహిళను చంపే సన్నివేశం గోద్రా ఊచకోత తర్వాత జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తుందని ఆరోపణలు వచ్చాయి. ‘ఎంపురాన్’ సినిమా బిజెపికి, హిందూత్వ వాదులకు వ్యతిరేకంగా నిర్మించబడిందని పుకార్లు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత నటుడు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేసిన మోహన్ లాల్, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని అన్నారు. అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిస్తామని సూచించారు.ఇప్పటికే దీనిపై స్పందించిన దర్శక, నిర్మాతలు మరోసారి సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు.. పలు సన్నివేశాలకు సంబంధించి 24 ‘కట్స్’ చెప్పింది.
ఇక ఎంపురాన్ సినిమాలోని చాలా సన్నివేశాలను కట్ చేశారు. కొన్ని పాత్రల పేర్లను మార్చారు. కొన్ని చోట్ల సంభాషణలు మ్యూట్ చేశారు. అలాగే కొన్ని చోట్ల నేపథ్య సంగీతాన్ని మార్చారు, సినిమాలో మొత్తం 24 మార్పులు చేశారు. ఈ చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబూర్, మోహన్ లాల్ కు చాలా సన్నిహితుడు. సన్నివేశాలను సవరించే బాధ్యతను మోహన్ లాల్ స్వయంగా తీసుకున్నాడని చెబుతున్నారు.
స్పందించని దర్శకుడు పృథ్వీరాజ్..
మరోవైపు ఈ వివాదంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ అతని తల్లి మీడియాతో మాట్లాడుతూ, “నా కొడుకు ఎవరినీ తప్పుదారి పట్టించే పని చేయలేదు” అని అన్నారు. “మోహన్ లాల్ తో సహా అందరికీ ఈ సినిమా కథ, సంభాషణలు తెలుసు” అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.