AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

సినిమా ఇండస్ట్రీలో అందరి లైఫ్ ఒకే లా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ గా రాణించారు. కోట్లకు పడగలెత్తిన నటులు కూడా ఉన్నారు. కోట్ల ఆస్తులు అనుభవించి.. చివరి రోజుల్లో ఊహించని విధంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు.

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..
Valluri Balakrishna
Rajeev Rayala
|

Updated on: May 16, 2026 | 7:54 PM

Share

100 పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, 400 చిత్రాలకు పైగా సహాయ పాత్రలలో నటించి, తెలుగు సినిమా హాస్యానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన నటుడు వళ్ళూరి బాలకృష్ణ. ఆయన నిజ జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఏలూరులోని ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచి బక్క పలుచటి ఆకారం కారణంగా స్నేహితుల ఆటపట్టించేవాడు. ఐదవ తరగతితో చదువును ఆపేసి, నాటకరంగంలోకి ప్రవేశించి తన దేహాన్ని హాస్యానికి ఆయుధంగా మలచుకున్నారు. నేల మీద కాలు నిలపని విలక్షణమైన శైలితో నాటకాల్లో గుర్తింపు పొందారు. సినిమాల్లోకి ప్రవేశించాలనే తపనతో టిక్కెట్ లేకుండా కలకత్తా చేరుకుని, తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తండ్రి సాలూరి సన్యాసిరాజు ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. అవకాశాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీలో టీ, కాఫీలు అందిస్తూ జూనియర్ ఆర్టిస్ట్‌గా చిన్న పాత్రలు పోషించారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

1950లో కే.వి.రెడ్డి దృష్టిని ఆకర్షించి, పాతాళ భైరవి చిత్రంలో అంజిగాడు పాత్రకు ఎంపికయ్యారు. ఈ పాత్రతో ఆయన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌తో ఆయనకు ఏర్పడిన స్నేహం, పాతాళ భైరవి చిత్రంలో వారి టైమింగ్‌కు ఎంతగానో దోహదపడింది. ఈ సినిమా తర్వాత వళ్ళూరిని అంజిగాడ్రోయ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో పద్మనాభం మాంత్రికుడి శిష్యుడిగా నటించగా, తెరపై శత్రువులైనప్పటికీ, బయట మాత్రం ప్రాణ స్నేహితులయ్యారు. పాతాళ భైరవిలో వళ్ళూరిని చూసే రాజుబాబు స్ఫూర్తి పొంది, తర్వాత కాలంలో హాస్య చక్రవర్తిగా ఎదిగారు. పాతాళ భైరవి తర్వాత ఎన్టీఆర్‌తో అనేక జానపద చిత్రాల్లో నటించారు. కే.వి.రెడ్డిని దైవంతో, విజయ సంస్థను దేవాలయంతో పోల్చి, ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాల్లో అవకాశాలు పొందారు. దర్శకుడు బి. విఠలాచార్య జానపద చిత్రాలలోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. ఒక దశలో పద్మనాభం కంటే బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిన బాలకృష్ణ, ప్రారంభంలో రూ. 15 పారితోషికం తీసుకుంటే, తర్వాత రూ. 15,000 కు పెరిగింది. కాంతారావు, ఏఎన్నార్, చిరంజీవి వంటి నటులతోనూ ఆయన కలిసి పనిచేశారు. మిస్సమ్మలో ఏఎన్నార్ శిష్యుడిగా, మాయాబజార్లో ఉత్తర కుమారుడికి చెలికాడుగా ఆయన నటన మెప్పించింది.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

వళ్ళూరి బాలకృష్ణకు ఏడుగురు ఆడపిల్లలు. మొదట్లో తన ఇంటిని మహాలక్ష్ములతో కళకళలాడుతుందని గర్వపడినప్పటికీ, దురదృష్టవశాత్తు వారి జీవితాలు దయనీయంగా మారాయి. మద్యపానం, ఇతరులకు హామీలు ఇవ్వడం వంటి అలవాట్ల కారణంగా ఆయన ఆస్తులు కరిగిపోయాయి. పరోక్షంగా కొన్ని చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించి, ఆ చిత్రాలు పరాజయం పాలవడంతో తీవ్ర నష్టాలను చవిచూశారు. సహాయం కోరిన వారిని నిరాకరించలేని స్వభావం కూడా ఆయన ఆర్థిక పతనానికి కారణమైంది. ఖరీదైన కార్లలో షూటింగ్‌లకు వెళ్ళడం వంటి ఆర్భాటాలు, మద్యపానం వ్యసనం వల్ల షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు షూటింగ్‌లు రద్దు కావడంతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది. ఇతర హాస్యనటుల రాకతో అవకాశాలు తగ్గడంతో ఆయన మరింతగా మద్యపానానికి బానిసయ్యారు. 80వ దశకం వచ్చేసరికి, తన ఆస్తులన్నీ కోల్పోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మద్రాసులోని ఆస్తులన్నీ అమ్ముకొని చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ జీవితం గడిపారు. తన చివరి రోజుల్లో పిల్లలకు మూడు పూటలా భోజనం పెట్టలేక, రాత్రులు నిద్రపట్టక, ఒంటరిగా కుమిలిపోయారు. చివరిసారిగా బలిదానం చిత్రంలో నటించిన వళ్ళూరి బాలకృష్ణ, 1982లో హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన స్నేహితుడు పద్మనాభం కన్నీటి పర్యంతమై, బాలకృష్ణ అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us