AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో స్టార్ హీరోయిన్.. అన్నీ పోగొట్టుకొని గుళ్లో ప్రసాదం తిని కడుపు నింపుకుంది.. చివరకు అనాథలా

తెలుగు సినీ పరిశ్రమలో కొందరు నటీనటులు ఓ వెలుగు వెలిగి, చివరి రోజుల్లో అష్టైశ్వర్యాలు కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి విషాద గాథే ఈ హీరోయింది. ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. కానీ ఉహించని విధంగా అన్ని కోల్పోయింది.

అప్పట్లో స్టార్ హీరోయిన్.. అన్నీ పోగొట్టుకొని గుళ్లో ప్రసాదం తిని కడుపు నింపుకుంది.. చివరకు అనాథలా
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2026 | 12:52 PM

Share

రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఉదయానికి మాయమైనట్లు, సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన కొందరు తారలు కాలక్రమేణా తెరమరుగైపోతూ ఉంటారు. అవకాశాలు ఉన్నప్పుడు స్టార్స్ గా రాణించి, లగ్జరీ లిడ్ లీడ్ చేసిన  ఎంతోమంది నటీనటులు చివరి రోజుల్లో సర్వం కోల్పోయి తినడానికి తిండి కూడా లేకుండా దుర్భర జీవితాన్ని అనుభవించారు. అలాంటి దురదృష్టవంతురాలైన వారిలో ఈ నటి ఒకరు. ఆమె పేరు కే. మాలతి. ఈ అందాల నటి జీవితగాథ ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందిన కే. మాలతి 1926లో ఏలూరులో జన్మించారు. ఆమె ఐదవ ఏటనే తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ కన్నుమూశారు. చిన్నతనం నుంచే సంగీతం నేర్చుకున్న మాలతి అనేక నాటకాలలో నటించారు. వీరాచారి అనే వ్యక్తితో చాలా చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతోనే మాలతి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!

తొలుత ఉషా అనే చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నటించారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, మాలతి నటనకు మంచి పేరు వచ్చింది. 1940లో సుమంగళి చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత భక్తి పోతన, భాగ్యలక్ష్మి, మాయా మచ్చీంద్ర, గుణసుందరి కథ వంటి చిత్రాల్లో నటించారు. తన పదేళ్ల సినీ కెరీర్‌లో ఐదు చిత్రాల్లో మాత్రమే నటించిన మాలతికి, 1951లో వచ్చిన పాతాళభైరవి గొప్ప పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ చిత్రం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావుల కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. పాతాళభైరవి తర్వాత మాలతికి వెంటనే పెద్ద అవకాశాలు రాలేదు, రెండేళ్ల విరామం తర్వాతే కొన్ని సినిమాలు చేశారు. అయితే, సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆమెను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది.

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

ఒకప్పుడు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా నటించిన మాలతి, కాలక్రమేణా అదే ఎన్టీఆర్ చిత్రాలలో ఆయనకు సోదరిగా నటించాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. 1979లో వచ్చిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఆమె చివరి చిత్రం. ఒకవైపు సినీ అవకాశాలు పూర్తిగా ఆగిపోవడం, మరోవైపు జీవిత భాగస్వామి, భర్త వీరాచారి మరణం మాలతిని ఒంటరిని చేసింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఆమె తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో, మాలతి హైదరాబాద్‌కు వచ్చి కాచిగూడ ప్రాంతంలో ఒక సినిమా థియేటర్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. ఆ పక్కనే ఉన్న ఆలయంలోని పూజారి ఆమె దుస్థితిని చూసి రెండు పూటలా ప్రసాదం పెట్టేవారు. ఆ ప్రసాదాన్ని తింటూనే ఆమె జీవనం సాగించారు. తాను ఒక సినీ నటిని అన్న విషయం ఎవరికీ చెప్పకపోవడంతో, ఆమెను ఎవరూ గుర్తించలేదు. రాజభోగం అనుభవించిన మాలతి పరిస్థితిని చూసి ఆ దేవుడికే మనసు చివుక్కుమందో ఏమో, ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. 1979 నవంబర్ 25న ఈదురు గాలులకు ఒక సినిమా థియేటర్‌కు చెందిన 20 అడుగుల గోడ ఆమె రేకుల ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో మాలతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఆమె ఇంటిని పరిశీలించినప్పుడు ఒక ట్రంకుపెట్టెలో ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి. దీంతో ఆమె పాతాళభైరవిలో నటించిన హీరోయిన్ మాలతి అని అందరూ గుర్తించారు. అంతేకాకుండా, ఆమె తన కష్టాలు, బాధల గురించి రాసుకున్న డైరీ కూడా బయటపడటంతో ప్రతి ఒక్కరూ ఆమె విషాద జీవితాన్ని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డారు.

ఇవి కూడా చదవండి

సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us