Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు.. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ మధ్య వ్యత్యాసం ఇదే..
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ 2024: లోక్సభ ఎన్నికలలో ఏడో దశ ఓటింగ్ ముగిసిన తర్వాత, జూన్ 1 సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సర్వేల ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేయవచ్చు. ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి, అది ఎలా నిర్వహిస్తారు. దాని నియమాలు ఏంటి, వాటిని ఉల్లంఘింస్తే శిక్ష ఎలా ఉంటుంది అనే అంశాలతో పాటు ఎగ్జిట్ పోల్ నుండి అభిప్రాయ సేకరణ ఎంత భిన్నంగా ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లోక్సభ ఎన్నికలలో ఏడో దశ ఓటింగ్ ముగిసిన తర్వాత, జూన్ 1 సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సర్వేల ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేయవచ్చు. ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి, అది ఎలా నిర్వహిస్తారు. దాని నియమాలు ఏంటి, వాటిని ఉల్లంఘింస్తే శిక్ష ఎలా ఉంటుంది అనే అంశాలతో పాటు ఎగ్జిట్ పోల్ నుండి అభిప్రాయ సేకరణ ఎంత భిన్నంగా ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజు సాయంత్రం పలు సర్వే ఏజెన్సీలు అందజేసే ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. ఈ సర్వేల ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేయనున్నారు. దేశంలోని వివిధ ఏజెన్సీలు వారి సంబంధిత గణాంకాలను విడుదల చేస్తాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ సర్వే ఏజెన్సీలు వెల్లడించిన పోల్ డేటా ఎంతవరకు కచ్చితమైనదో తేలిపోతుంది. చివరి దశ ఓటింగ్ ముగిసిన 30 నిమిషాల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. అయితే ఒడిశాలో నిబంధనను ఉల్లంఘించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక టీవీ ఛానెల్ ఎగ్జిట్ పోల్ను ప్రసారం చేసింది. ఆ తర్వాత, ఆ టీవీ ఛానెల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది.
ఎగ్జిట్ పోల్ అంటే.. వాటిని ఏజెన్సీలు ఎలా నిర్వహిస్తాయి?
ఎగ్జిట్ పోల్ అనేది ఒక రకమైన ఎన్నికల సర్వే, ఇది ఓటర్ల ప్రతిస్పందనల ఆధారంగా తయారు చేస్తారు. ఓటింగ్ రోజున, న్యూస్ ఛానల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే ఏజెన్సీల ప్రతినిధులు పోలింగ్ స్టేషన్ల వద్ద ఉంటారు. ఆ ఏజెన్సీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఓటు వేసిన తరువాత ఆ ఓటర్లను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడతారు. అలా ఓటర్ల సమాధానాలను విశ్లేషించి ఎవరివైపు మొగ్గు చూపారో అంచనా వేస్తారు. ఈ సర్వేలో కేవలం ఓటర్లు మాత్రమే ఉంటారు కావున వారి అంచనాలు, లెక్కింపు ఫలితాలకు వీలైనంత దగ్గరగా ఉంటాయని అభిప్రాయపడుతూ ఉంటారు.
నిబంధనలు అతిక్రమిస్తే శిక్షలు ఇవే..
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయకూడదు అనే దాని గురించి చట్టం, కేంద్ర ఎన్నికల కమిషన్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అన్ని దశల ఓటింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రభావం మరో విడతలో జరిగే ఎన్నికలపై ప్రభావం చేపుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చింది ఎన్నికల సంఘం. 1998లో తొలిసారిగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, దీని తర్వాత కూడా, ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్కు సంబంధించిన మార్గదర్శకాలు వేర్వేరు సమయాల్లో జారీ చేయబడ్డాయి. ఏదైనా న్యూస్ ఛానెల్ లేదా సర్వే ఏజెన్సీ ఈ నిబంధనను పాటించకపోతే, 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని చట్టం చెబుతోంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు నమ్మొచ్చు..
ఎగ్జిట్ పోల్స్ కేవలం ఎన్నికల మూడ్ ను మాత్రమే తెలియజేస్తాయి. అయితే, ఇవి కచ్చితంగా ఉంటాయా లేదా అనేది నిజమైన ఫలితాల ముందు స్పష్టం చేయలేము. చాలా సార్లు ఈ అంచనాలు కచ్చితమైనవని నిరూపించబడ్డాయి. కానీ కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా కూడా ఉన్నాయి. అయితే, ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు సర్వే ఏజెన్సీలు. ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిట్ పోలింగ్ నెదర్లాండ్స్లో ప్రారంభమైంది. 15 ఫిబ్రవరి 1967న, డచ్ సామాజికవేత్త, మాజీ రాజకీయవేత్త మార్సెల్ వాన్ డామ్ ఎగ్జిట్ పోల్కు పునాది వేశారు. ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి మార్సెల్ వాన్ డామ్ అంచనా కచ్చితంగా ఫలితాలకు దగ్గరగా వచ్చింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ భారతదేశంలో అధికారికంగా 1996లో ప్రారంభమయ్యాయి. దీనిని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) తొలిసారి నిర్వహించింది. అప్పుడు జర్నలిస్ట్ నళినీ సింగ్ దూరదర్శన్ కోసం ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. దీనికి సంబంధించిన డేటాను CSDS సేకరించింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అప్పటి సర్వేలో తెలిపింది.
ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ మధ్య వ్యత్యాసం..
సాధారణంగా ప్రజలు ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ ఒకేలా భావిస్తారు. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఒపీనియన్ పోల్ కూడా ఒక రకంగా ఎన్నికల సర్వే లాంటిదే. అయితే ఎన్నికలకు ముందే వాటిని విడుదల చేస్తారు. దాని సర్వేలో ప్రజలందరి అభిప్రాయాలను సేకరిస్తారు. వారు ఓటర్లా కాదా అనేది అవసరం లేదు. ఈ ఒపీనియన్ పోల్స్లో కేవలం పౌరుని అభిప్రాయం తెలుసుకుంటారు. ప్రాంతాల వారీగా ప్రజలకు వివిధ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. వాటిని విశ్లేషించిన తర్వాత, ఒక సర్వేను విడుదల చేస్తారు. అయితే ఎగ్జిట్ పోల్ ఓటింగ్ రోజున జరుగుతుంది. కానీ ఒపీనియన్ పోల్ ఎన్నికలకంటే నెల రోజులు ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఒక్కోసారి పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ ఒపీనియన్ పోల్స్ లో కీలక మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒపీనియన్ పోల్స్ కు ఎగ్జిట్ పోల్స్ కు మధ్య కూడా చాల వ్యత్యాసం ఉంటుంది. ఒపీనియన్ పోల్స్ అంటే పోలింగ్ కు ముందు ప్రజల అభిప్రాయం. ఎగ్జిట్ పోల్ అంటే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన వచ్చిన తరువాత సగటు ఓటరు తెలిపే అభిప్రాయం. అందుకే ఒపీనియన్ పోల్ కంటే ఎగ్జిట్ పోల్ ఫలితం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని పలువురు గట్టిగా, బలంగా విశ్వసిస్తారు.
మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








