బిర్యానీ తెచ్చిన తంటాలు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్‌.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుస్టేషన్‌లో బిర్యానీ తినడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో..

బిర్యానీ తెచ్చిన తంటాలు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్‌.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌
Follow us

|

Updated on: Jun 13, 2021 | 9:31 AM

ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుస్టేషన్‌లో బిర్యానీ తినడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. అయితే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు కావడం, అతడిని విచారణ నిమిత్తం కేసుకు సంబంధం లేని పోలీసుస్టేషన్‌లో ఉంచిన సమయంలో అతడు బిర్యానీ తింటున్న పోలీసుస్టేషన్‌ ఫోటో, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. అయితే ఈ కేసు తమది కాదని, నిందితుడు తమ పరిధిలో లేడని, విచారణ నిమిత్తం తీసుకువచ్చిన వ్యక్తి చికెన్‌ బిర్యానీ తింటే తమ ఉద్యోగాలకు ప్రమాదం పొంచివుందని తెలియక ఇద్దరు పోలీసులు విధుల నుంచి ఉద్వాసనకు గురయ్యారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సాయన్న, మరో కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌లను సస్పెండ్‌ చేస్తూ నిజామాబాద్‌ సీసీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల చివరి వారంలో ఆర్మూర్‌ పీఎస్‌లో జమేదార్‌ సాయన్న, వాచ్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ల నిర్లక్ష్యం కారణంగానే సిదార్ధ అనే యువకుడి హత్య కేసులో ప్రధాన సూత్రదారి రాజేష్‌ బిర్యానీ తింటూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారం బయటకు రావడంతో వీరిపై వేటు పడింది. అంతేకాదు ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులకు మెమోలు ఇచ్చి సంజాయిషీ కోరినట్లు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అయితే పీఎస్‌లో ఎస్‌హెచ్‌ఓల ఆదేశాలు లేకుండా నేరస్థులకు, ఇతరులకు ఎలాంటి సేవలు అందవు. అంతా స్టేషన్‌ అధికారుల ఆదేశాల మేరకు జరిగినా వారిని వదిలేసి కింది స్థాయి సిబ్బందిని బలి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే మే 19న కమ్మర్‌పల్లి మండలం హసకోత్తురుకు చెందిన మాలవత్‌ సిద్ధార్థ అనే యువకుడిని గ్రామానికి చెందిన కనుక రాజేష్‌తో పాటు మరో నలుగురు కలిసి కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజేష్‌ను అదుపులోకి తీసుకుని కమ్మర్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఉంచితే శాంతిభద్రతల సమస్య వస్తుందని భావించి ఆర్మూర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో తన ఇద్దరు అనుచరులతో మే 22వ తేదీన పీఎస్‌లో బిర్యానీ తింటున్న ఫోటోలు, వీడియో, వాయిస్‌ కాల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఓ బీజేపీ నేతలు తప్పుబట్టారు. పోలీసు స్టేషన్‌లో ఇలా బిర్యానీ తినడం వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. పోలీసులు హంతకులకు కొమ్ము కాస్తున్నారంటూ ఆ రోజు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించకుండా ఆందోళనకు దిగారు. తర్వాత ఇలా వీడియోలు బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది.

Helmets: వాహనదారులకు హెచ్చరిక.. ఈ హెల్మెట్లపై కేంద్రం నిషేధం.. రూ.లక్ష జరిమానా.. ఏడాది జైలుకు!

Suspension: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం.. ఇందల్వాయి ఎస్ఐపై వేటు..