Corona Threat: కరోనా వైరస్ వైఫైలాగా మన చుట్టే వుంది.. అప్రమత్తత కోల్పోతే అంతే సంగతి.. సీసీఎంబీ తాజా హెచ్చరిక

కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోకి కరోనా వైరస్ ప్రవేశించి ఏడాది ముగిసిన నేపథ్యంలో సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థల సంయుక్తంగా ఓ అధ్యయనం...

Corona Threat: కరోనా వైరస్ వైఫైలాగా మన చుట్టే వుంది.. అప్రమత్తత కోల్పోతే అంతే సంగతి.. సీసీఎంబీ తాజా హెచ్చరిక
Follow us

|

Updated on: Mar 05, 2021 | 5:26 PM

Coronavirus moving like WiFi: కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోకి కరోనా వైరస్ ప్రవేశించి ఏడాది ముగిసిన నేపథ్యంలో సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థల సంయుక్తంగా ఓ అధ్యయనం జరిపాయి. ఈ అధ్యయనంలో ఆశ్చర్యపరిచే అంశాలతోపాటు షాకిచ్చే ప్రమాద ఘంటికలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే, సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త కూడా చెప్పారు తాజా అధ్యయనం తర్వాత.

మార్చి రెండో తేదీ నాటికి తెలంగాణలో కరోనా వైరస్ సోకిన తొలి కేసు నమోదై ఏడాది పూర్తయ్యింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా 2020 మార్చి రెండో తేదీన ధృవీకరించారు. భాగ్యనగరానికి చెందిన ఒక యువకుడు దుబాయి నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాదు చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిలో మొదటిసారిగా కరోనా పాజిటివ్ ను గుర్తించారు. అతనికి గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందించారు. ఆఫీస్‌ పనిపై దుబాయ్‌ వెళ్ళొచ్చిన రామ్ తేజ అనే యువకుడిలో వైరస్‌ గుర్తించారు. చికిత్స అనంతరం మార్చి13న రామ్ తేజను డిశ్చార్జీ చేశారు. తొలి కేసు తర్వాత ఏమీ ఉండదులే అనుకున్నారంతా. అదే సమయంలో ఢిల్లీలోని మర్కజ్‌ సంఘటనతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో వైరస్‌ జాడ తెలంగాణను వణికించింది. మర్కజ్‌ ప్రయాణీకులు, వారి సన్నిహితుల్లోనూ కరోనా వ్యాప్తి పరిస్థితిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖా మంత్రి సొంత జిల్లా కరీంనగర్‌ను కరోనా తొలుత బెంబేలెత్తించింది.

మార్చి 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ విధించింది. మొత్తమ్మీద మార్చి, 2020లో తెలంగాణలో 61 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 27న మర్కజ్‌ వెళ్లొచ్చిన వ్యక్తి మృతి. ఇదే రాష్ట్రంలో కరోనాతో తొలి మరణంగా రికార్డయ్యింది. ఏప్రిల్‌లో 977 కేసులు నమోదు కాగా 26 మంది మృతి చెందారు. మే నెలలో 1.660 కేసులు నమోదయి.. 54 మంది మృత్యువాత పడ్డారు. జూన్‌ నెలలో 13,641 కేసులు రికార్డయ్యాయి. 181 మంది మృతి చెందారు. జులై నెలలో 48,447 కేసులు నమోదై.. 276 మంది మృతి చెందారు. ఆగస్టు నెలలో 62,911 కేసులు రికార్డయి.. 297 మంది మృత్యువాత పడ్డారు. సెప్టెంబర్‌ నెలలో 65,903 కేసులు నమోదయ్యాయి. 299 మంది మృతి చెందారు. అక్టోబర్‌ నెలలో 46,448 కేసులు నమోదై.. 206 మంది మృతి చెందారు. నవంబర్‌ నెలలో 30,270 కేసులు రికార్డయి.. 120 మంది మృతి చెందారు. డిసెంబర్‌ నెలలో 16,497 కేసులు నమోదై.. 83 మంది చనిపోయారు. 2021 జనవరిలో 7,772 కేసులు రికార్డయ్యాయి. 57 మంది మరణించారు. 2021 ఫిబ్రవరిలో 4,336 కేసులు నమోదై.. 33 మంది చనిపోయారు.

కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో 2020 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పీక్ లెవెల్‌కు చేరుకుంది. 2020 జులై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణలో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా సగటున 9.96 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం (మార్చి 1 ఉదయం నుంచి మార్చి 2 ఉదయం వరకు) కొత్త‌గా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు మృతి చెందారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 157. తెలంగాణలో ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నవారు 1,907 మంది. హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారు మరో 774 మంది. 2020 నవంబర్ తర్వాత కరోనా వ్యాప్తి స్లో డౌన్ అవగా.. తాజాగా రోజుకు వంది నుంచి రెండొందల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు బాగా తగ్గిపోగా.. కోలుకున్న వారి శాతం 98ని దాటేసింది. జాతీయ సగటు కన్నా తెలంగాణలో కోలుకున్న వారి శాతం ఎక్కువ.

ఈ నేపథ్యంలో తాజాగా సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కీలకాంశాలు వెల్లడయ్యాయి. కరోనా లెక్కల విషయంలో సీసీఎంబీ ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వున్న వారిలో 75 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ అంశాన్ని సీసీఎంబీ నిర్ధారించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను సీసీఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందజేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సోకినప్పటికీ కొందరిలో ఎలాంటి లక్షణాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ నగర జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ధృవీకరించినట్లు కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే.. సీరో అధ్యయనంలో నిర్ధారించిన అంశాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ ఇంకా మన చుట్టూనే వుంది. ఒకరకంగా చెప్పాలంటే కరోనా వైరస్ మన చుట్టూ వైఫై (WiFi) లాగా తిరుగుతూనే వుంది. నిర్లక్ష్యం చేస్తే కరోనా మళ్ళీ విజృంభించే అవకాశవుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలసత్వం ప్రదర్శిస్తే.. కరోనా లెక్కలు తల్లకిందులవుతాయని సీసీఎంబీ సైంటిస్టులు వార్నింగిస్తున్నారు. అయితే, ఒకసారి కరోనా సోకి కోలుకున్న వారికి మరోసారి కరోనా సోకే అవకాశాలు మాత్రం లేవన్న శుభవార్తను సీసీఎంబీ సైంటిస్టులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో రీఇన్‌ఫెక్షన్ లేదని డాక్టర్‌ రాకేశ్ మిశ్రా అంటున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా హైదరాబాద్‌లో కరోనా విస్తృతి, తీవ్రత తక్కువగా వున్నాయని వెల్లడించారు. దాదాపు 80 శాతం మందిలో కరోనాను తట్టుకునే సామర్థ్యం ఉందని తెలుస్తోంది. యాంటీబాడీల శాతం టీకాలతో రెట్టింపయ్యే అవకాశం వుందని వైద్యవర్గాలు అంటున్నాయి.

తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే వుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి ఒకటవ తేదీన తాను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వెల్లడించారు. అయితే.. పొరుగునే వున్న మహారాష్ట్రలో అత్యధికంగా కొత్త కేసులు నమోదు అవుతండడం కాస్త ఆందోళన కలిగించే పరిణామం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ నగరాలకు పెద్ద సంఖ్యలో జనం ప్రతీ రోజుల రాకపోకలు సాగిస్తుంటారు. వారి ద్వారా తెలంగాణలో మరోసారి వైరస్ విజృంభిస్తుందేమో అన్న భయాందోళన ప్రజల్లో ప్రస్తుతం వ్యక్తమవుతోంది.

ALSO READ: ఆరేళ్ళలో ఎన్నో బందులు.. కానీ నేటిది మాత్రం ప్రత్యేకమే!

ALSO READ: ఇపుడు అందరి కళ్ళు ఆయనపైనే.. ఎందుకంటే సడన్‌గా సీఎం కేండిడేట్ అయ్యాడు కదా!

ALSO READ: చిన్నమ్మ సన్యాసం వెనుక వున్నదెవరో తెలుసా?