JoSAA Counselling 2025: జోసా 2025 వెబ్సైట్ వచ్చేసింది.. మరో 10 రోజుల్లోనే కౌన్సెలింగ్ ప్రారంభం!
2025-26 విద్యాసంవత్సరంకి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. మొత్తం 127 విద్యాసంస్థల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గత ఏడాది జోసా కింద 121 విద్యాసంస్థలుండగా..

హైదరాబాద్, మే 19: దేశవ్యాప్తంగా 2025-26 విద్యాసంవత్సరంకి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. మొత్తం 127 విద్యాసంస్థల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గత ఏడాది జోసా కింద 121 విద్యాసంస్థలుండగా ఈసారి కొత్తగా మరో 6 సంస్థలు చేరడంతో ఆ సంఖ్య 127కి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఈ విద్యా సంస్థల పేర్లను సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్టీఐ) ఇంకా వెల్లడించలేదు. మొత్తంగా ఈ సారి 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ఐటీలు, మరో 46 జీఎఫ్టీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ముస్తాబవుతుంది. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ జోసా వెబ్సైట్ 2025ను మే 17న అందుబాటులోకి తీసుకొచ్చింది.
జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారితో పాటు జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారికి కూడా జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, జీఎఫ్టీఐల్లో ప్రవేశాలు కల్పి్స్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. కాగా గత ఏడాది 23 ఐఐటీల్లో 17,740 బీటెక్, బీఎస్, బీటెక్+ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. వీటితోపాటు 121 విద్యాసంస్థల్లో మొత్తం 59,917 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి కొత్తగా మరో ఆరు విద్యాసంస్థలు పెరిగడంతొ మరికొన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లోనూ ఈ ఏడాది స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలి, మలి విడతలు పూర్తవ్వగా.. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కూడా జరిగింది. ఈపరీక్ష ఫలితాలు జూన్ 2వ తేదీన వెల్లడవుతాయి. ఫలితాలు వచ్చిన వెంటనే అంటే జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




