10th Class Paper Leak 2026: పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లిక్.. వాట్సప్లో చక్కర్లు! తొమ్మిది మందిపై సస్పెన్షన్ వేటు
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 16, 2026వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే మార్చి 18న జరిగిన హిందీ ఎగ్జాం పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సప్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల..

నిజామాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 16, 2026వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే మార్చి 18న జరిగిన హిందీ ఎగ్జాం పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సప్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలుగు మీడియం విద్యార్థులకు హిందీ పరీక్ష నిర్వహించారు. అయితే ఇక్కడ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్లు హిందీ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సప్లో ఇతరులకు పంపించారు. వీటిని తెలిసిన వ్యక్తులకు పంపించి సమాధానాలు సైతం తెప్పించారు.
బోధన్, మెండోరా మండలాల్లోని వాట్సప్ గ్రూపుల్లో ఈ పేపర్ వైరల్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన డీఈవో అశోక్ విచారణ చేపట్టగా.. మొత్తం 9 మంది హస్తం ఇందులో ఉన్నట్లు తేలింది. నిందితులను రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్కుమార్ (స్కూల్అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్)గా గుర్తించారు. కలెక్టర్ ఆదేశాశాలతో నిందితులు ఏడుగురిని సస్పెండ్ చేశారు. అనంతరం వీరిని విచారన నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
తొలుత ఆలూరు కేంద్రంలోనే ఈ ఘటన జరిగినట్లు భావించినప్పటికీ.. బోధన్, మెండోర పరీక్షా కేంద్రాల్లోనూ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా కేంద్రాలకు చెందిన ఏడుగురు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరులో జరిగిన పేపర్ లీక్ పై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. జిల్లాలో ఉన్న 144 పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి పేపర్ లీక్ ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తతంగం ఎప్పట్నుంచో రహస్యంగా ప్రతి పేపర్ ను ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు ఏదో ఒక పరీక్ష కేంద్రం నుంచి క్వశ్చన్ పేపర్లు అందించిన 15 నిమిషాల్లోనే బయటకు వస్తుందని సమాచారం. వంద శాతం రిజల్ట్స్ కోసం, ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పరీక్ష కేంద్రాల్లో డ్యూటీలు చేస్తున్న వారికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా పేపర్ లీక్లకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




