Jeep company discounts: ఈ కార్లను కొంటే లక్షలు ఆదా చేసినట్టే.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా, దాని కోసం అన్ని కంపెనీల కార్ల ధరలను పరిశీలిస్తున్నారా, అయితే మీలాంటి వారికి జీప్ ఇండియా కంపెనీ శుభవార్త చెప్పింది. తన ఎస్యూవీ మోడళ్లపై దాదాపు రూ.3 లక్షల తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై ఇది అమలవుతుంది.

భారత మార్కెట్లో రాంగ్లర్, కంపాస్, గ్రాండ్ చెరోకి, మెరిడియన్ అనే నాలుగు రకాల మోడళ్లను జీప్ కంపెనీ విక్రయిస్తోంది. వీటిలో రాంగ్లర్ మినహా మిగిలిన మోడళ్లపై డిస్కౌంట్ అందిస్తోంది. స్లెల్లాంటిస్ యాజమాన్యంలోని జీప్ బ్రాండ్ నుంచి నాలుగు రకాల మోడళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల వీటి విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో వాటిని పెంచుకునే పనిలో భాగంగా కంపెనీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీనికోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలను ప్రవేశ పెట్టింది. దాని ప్రకారం కొనుగోలు దారులు రూ.3 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు.
జీప్ కంపాస్
జీప్ ఇండియా వాహన శ్రేణిలో పరిచయ మోడల్గా కంపాస్ను చెప్పవచ్చు. దీని ధర రూ.18.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బెస్ట్ వేరియంట్ రూ.32.41 లక్షలు పలుకుతుంది. ప్రస్తుతం దీనిపై రూ.2.7 లక్షల ప్రయోజనాలు పొందవచ్చు. 2024 మోడల్ ఇయర్ (ఎంవై2024) కంపాస్పై రూ.1.10 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లకు వీటిని వర్తింపజేస్తారు. కార్పొరేట్ క్లయింట్లకు పరిమిత సమయం వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదనంగా ఈ నెలలో వైద్యులు, లీజింగ్ కంపెనీలు, భాగస్వాములకు రూ.15 వేల ప్రయోజనాలను అందిస్తున్నారు. వీటి సమగ్ర వివరాలకు సమీపంలోని డీలర్ షిప్ను సంప్రదించాలి. కంపాస్లో 2.0 లీటర్ల టర్బోచార్జ్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. దీని నుంచి 168 బీహెచ్పీ, 350 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను ఎంపిక చేసుకోవచ్చు.
జీప్ మెరిడియన్
జీప్ మెరిడియన్ ప్రస్తుతం రూ.24.99 లక్షల నుంచి రూ.38.79 లక్షల (ఎక్స్షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. దీనిలోనూ కంపాస్ మాదిరిగానే ఇంజిన్ అమర్చారు. మార్చిలో ఈ కారును కొనుగోలు చేసిన వారు రూ.2.3 లక్షల వరకూ పొదుపు చేసుకోవచ్చు. కానీ పరిమిత సమయం వరకూ మాత్రమే అవకాశం ఉంటుంది. అదనంగా ఎంపిక చేసిన వేరియంట్లకు ఎంవై2024 ఇన్వెంటరీకి రూ.1.30 లక్షల వరకూ కార్పొరేట్ డిస్కౌంట్లు వర్తిస్తాయి. వైద్యులు, లీజింగ్ కంపెనీలకు మరో రూ.30 వేలు అదనంగా అందజేస్తారు. ఏడు సీట్లు కలిగిన ఈ ఎస్యూవీ.. లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్ ల్యాండ్ అనే నాలుగు రకాల ట్రిమ్ లలో లభిస్తుంది.
జీప్ గ్రాండ్ చెరోకి
జీప్ గ్రాండ్ చెరోకి ప్రస్తుతం రూ.67.5 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా రూ.3 లక్షల వరకూ తగ్గింపు పొందవచ్చు. అలాగే జీవ్ వేవ్ ఎక్స్క్లూజివ్ ప్యాకేజీకి అర్హత కూడా లభిస్తుంది. దీని ద్వారా మూడేళ్ల సమగ్ర వారంటీ, వేగవంతమైన సేవ తదితర ప్రయోజనం కలుగుతుంది. ఈ కారులో 2.0 లీటర్ల, నాలుగు సిలిండర్ల టర్బో- పెట్రోలు ఇంజిన్ అమర్చారు. దాని నుంచి 272 హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. దీన్ని 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ జతచేశారు. 2022లో మన దేశంలో రూ.77.5 లక్షల ధరతో గ్రాండ్ చెరోకి విడుదలైంది. ప్రారంభంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (సీబీయూ)గా దిగుమతి చేసుకుంది. అనంతరం స్థానికంగా అసెంబ్లీని ప్రారంభించడంతో ధరను తగ్గించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..