YSRCP: సామాజిక సాధికార యాత్ర రెండో దశ షురూ.. ఏయే ప్రాంతాల మీదుగా సాగనుందంటే.?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేసింది.? దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆయా వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు పదవుల్లో కూడా రిజర్వేషన్లు ఎలా అమలు చేసింది అనే అంశాన్ని వివరించడమే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్రలు చేపడుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేసింది.? దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆయా వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు పదవుల్లో కూడా రిజర్వేషన్లు ఎలా అమలు చేసింది అనే అంశాన్ని వివరించడమే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్రలు చేపడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వార్ జరుగుతుందని.. పేదలకు-పెత్తందార్లకు మధ్య యుద్దం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు సీఎం జగన్.
దీనికోసం సామాజిక సాధికార యాత్రలను చేపట్టాలని సూచించింది అధిష్టానం. గత తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎలాంటి అన్యాయం జరిగిందో వివరిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరిగిందనే విషయాన్ని బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు నేతలు. వచ్చే ఎన్నికల వరకూ పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా పలు కార్యక్రమాలకు అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమం చివరిదశకు చేరుకుంది.
ఇదే సమయంలో జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతుండగా మరోవైపు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం-పార్టీ కలిసి సచివాలయాల వారీగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే తొలి విడత బస్సు యాత్రలు ముగిశాయి. రెండో విడత బస్సు యాత్రలు ఇవాళ్లి నుంచి ప్రారంభం కానున్నాయి.
మూడు ప్రాంతాల్లో మూడేసి సభలు..
మొదటి విడత సామాజిక సాధికార యాత్రలు అక్టోబర్ 26 వ తేదీన ప్రారంభం అయ్యాయి. ప్రతి రోజూ రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఈ యాత్రలు జరగనున్నాయి. యాత్ర చివర్లో నియోజకవర్గ కేంద్రంగా బహిరంగ సభ ఉంటుంది. ఇక రెండో విడతలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరగనుంది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు సాగే ఈ రెండో విడత బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొననున్నారు. పేద, బడుగు వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించే ఈ సామాజిక సాధికార యాత్ర రెండో దశ 39 నియోజకవర్గాల్లో జరగనుంది. నాలుగున్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనలో సీఎం జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను.. చేసిన మంచిని వివరించే ఉద్దేశంతో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర మొదటి దశ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర పూర్తి అయ్యింది. నాలుగున్నరేళ్ల పాలనలో లంచాలు, వివక్షతకు తావులేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వపాలన సాగుతుందంటూ ప్రజలకు వివరించనున్నారు పార్టీ నేతలు.
సామాజిక వర్గాల వారీగా జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ..
సామాజిక సాధికార యాత్రల్లో పేదలు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. దీనికి తగ్గట్టుగానే భారీ సంఖ్యలో ఆయా సామాజిక వర్గాల ప్రజలు బహిరంగ సభలకు హాజరయ్యేలా నేతలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాత్రలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. ఓవైపు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను ఎలా మోసం చేస్తుందో చెప్పుకొస్తున్నారు. వైసీపీ పాలనలో నగదు బదిలీ ద్వారా రెండు లక్షల 40 వేల కోట్లు మహిళల చేతుల్లోకి వెళ్లాయని.. దేశ చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా సంక్షేమపాలన అందిస్తున్నామని మంత్రులు, ఇతర నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. అయితే మొదటి విడతల యాత్రలకు వచ్చిన ప్రజాస్పందనతో రెండో విడత మరింత ఉత్సాహంగా నిర్వహిస్తామంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..