Vizag: ధాన్యం తరలిస్తున్న వ్యాన్ను ఆపిన పోలీసులు.. పైన అన్నీ వరి బస్తాలే.. అడుగున మాత్రం..
బాబోయ్ మాయగాళ్లు. ఊహకు అందనోళ్లు. మాల్ను సీక్రెట్గా గట్టు దాటించేందుకు ఇస్మార్ట్ స్కెచ్చులు వేస్తున్నారు. కొత్త కొత్త ఇస్మార్ట్ ఐడియాలతో ఖాకీలకే సవాల్ విసురుతున్నారు.
గంజాయిని నిరోధించడం పోలీసులకు పెను సవాలుగా మారుతుంది. స్పెషల్ వింగ్ పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూ.. కేసులు బుక్ చేస్తున్నప్పటికీ.. పెడ్లర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్త పద్దతుల్లో గంజాయి అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు రూపు మాపేందుకు ఏపీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంది. అక్కడి గిరిజనులకు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగును వీడినవారికి ప్రొత్సహకాలు కూడా ఇచ్చింది. దీంతో ఏజెన్సీలో చాలావరకు గంజాయి సాగు తగ్గిపోయింది. దీంతో పెడ్లర్లు ఒరిస్సా బోర్డర్ ఏరియాలపై ఫోకస్ పెట్టారు. అక్కడి కోరాపుట్, మల్కన్గిరి జిల్లాల నుంచి వైజాగ్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.
తాజాగా ఓ వ్యాన్లో వరి బస్తాల కింద అక్రమంగా తరలిస్తున్న 1,000 కిలోల గంజాయిని వైజాగ్ సిటీ టాస్క్ ఫోర్స్ (సిటిఎఫ్) విభాగం శనివారం స్వాధీనం చేసుకుంది. 19 పెద్ద ప్లాస్టిక్ సంచులలో 1,000 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యాన్ను పెందుర్తి-ఆనందపురం హైవేపై సొంటియం రోడ్డుకు సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. లోపల చెక్ చేయగా వరి బస్తాల కింద గంజాయి ఉన్నట్లు తేలింది. 2021లో నగర శివార్లలోని పరవాడకు సమీపంలో పోలీసులు మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ మూడేళ్ల కాలంలో ఇదే రెండవ అతిపెద్ద గంజాయి సీజ్ అని పోలీసులు తెలిపారు. వైజాగ్ మార్గం గుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కేరళ ప్రాంతాలకు గంజాయి తరలింపు జరుగుతుందని వివరించారు.
పోలీసులు వాహనాలను సీరియస్గా తనిఖీ చేయడంతో స్మగ్లర్లు ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్లు, పాల ట్యాంకర్లు, అంబులెన్స్లతో పాటు కూరగాయలు, వరిధాన్యం, బియ్యం, ఇతర వస్తువుల ముసుగులో గంజాయి రవాణా చేసేందుకు యత్నిస్తూ పట్టుబడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..