పోచారం డ్యామ్కు కాళేశ్వరం నీళ్లు..
త్రివేణి సంమగం నుండి బయలుదేరిన కాళేశ్వరం వేములవాడ రాజన్నను, సిద్దిపేట రంగనాయకుడిని, గజ్వేల్ కొండపోచమ్మను అభిషేకించిన గోదావరి జలాలతో రైతుల కష్టాలు తీరనున్నాయి. ఎస్పారెస్పీ, కొండపోచమ్మసాగర్ ద్వారా
త్రివేణి సంమగం నుండి బయలుదేరిన కాళేశ్వరం వేములవాడ రాజన్నను, సిద్దిపేట రంగనాయకుడిని, గజ్వేల్ కొండపోచమ్మను అభిషేకించిన గోదావరి జలాలతో రైతుల కష్టాలు తీరనున్నాయి. ఎస్పారెస్పీ, కొండపోచమ్మసాగర్ ద్వారా పోచారం డ్యామ్ నింపి ఈ ప్రాంత రైతులకు పంటల సాగుకు నీరందిస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ మండల పరిధి రాజ్పేట్ శివారులో రూ. 5.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఎన్నోసార్లు రాజ్పేట్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేశారని..కానీ, పనులు మాత్రం జరగలేదని విమర్శించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూ. 5.50 కోట్ల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కంటే పోచారం ప్రాజెక్ట్ ముందుగా నిండుతుందని, అయినప్పటికి ఈ డ్యామ్ పరిసర ప్రాంత రైతులకు కొండపోచమ్మసాగర్ ద్వారా హల్దీ, ఎంఎన్ కెనాల్ మీదుగా ప్రాజెక్టును నింపి సాగు నీరు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏసీ నగేష్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.