AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hamsaladeevi: నిర్లక్ష్య నీడలో హంసలదీవి..పవిత్ర సాగరసంగమంలో అడుగడుగునా ఇబ్బందులే..

మహారాష్ట్రలో పుట్టి.. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ.. లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, నగరాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ.. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి..

Hamsaladeevi: నిర్లక్ష్య నీడలో హంసలదీవి..పవిత్ర సాగరసంగమంలో అడుగడుగునా ఇబ్బందులే..
Hamsaladeevi
Ganesh Mudavath
|

Updated on: Feb 03, 2023 | 9:31 PM

Share

మహారాష్ట్రలో పుట్టి.. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ.. లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, నగరాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ.. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. తన ప్రయాణంలో ఎన్నో వైవిధ్యతను చూపిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు వరదాయినిగా మారిన కృష్ణా.. సాగరంలో కలిసే చోటు అందమైన ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా అలరారుతోంది. ఎంత దూరం ప్రయాణించినా.. చివరికి అంతిమ గమ్యం చేరాల్సిందే అనే జీవిత సత్యాన్ని బోధిస్తున్న కృష్ణమ్మ అంతరార్థం యావత్ మానవాళికి దిక్సూచిలా మారింది. వేలకిలోమీటర్లు పరవళ్ళు తొక్కుతూ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. దీనిని చాలా పవిత్ర స్ధలంగా భావిస్తారు. ఈ ప్రదేశంలోనే రుక్మీనీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో మూడోరోజు సముద్రస్నానమాచరించే కార్యక్రమం ఉంటుంది. ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో సాగర సంగమ ప్రదేశంలో స్నానమాచరిస్తారు.

హంసలదీవికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే విషయంపై అనేక కథలు వినిపిస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది ఇదీ.. పూర్వకాలంలో ప్రజలు తాము చేసిన పాపాలు తొలగించుకునేందుకు గంగానదిలో స్నానం చేసేవారు. వారి పాపాలు మోయలకే గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి విష్ణుమూర్తి.. ఓ పాపపరిష్కార మార్గం సూచించారు. కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించాలని సూచించాడు. ఎక్కడైతే నలుపు రంగు తెలుపు గా మారుతుందో అప్పుడే నీకు పాప విముక్తి లభిస్తుందని చెప్పాడు. విష్ణుమూర్తి సూచనతో గంగా దేవి అనేక నదుల్లో స్నానమాచరించి చివరికి హంసల దీవి ప్రాంతానికి చేరుకుంది. సాగరసంగమం ప్రాంతంలో స్నానం చేస్తుండగా నలుపు రంగు కాస్త తెలుపుగా మారిపోయిందట. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవిగా పేరొచ్చిందని కథనం.

హంసలదీవి వద్ద పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. అడవుల్లో సంచరించే జంతువులు, పక్షులు, సముద్రంలో తిరిగే జీవరాశుల గురించి చిత్ర రూపంలో చిన్నారులకు సైతం అర్థమయ్యే రీతిలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. అటవీశాఖ వారి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే.. మడ అడవులు హంసలదీవి బీచ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి మధ్య సన్నటి నీటి పాయలు పర్యాటకుల మనసులు దోచుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

బీచ్, సాగర సంగమానికి సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో విహార యాత్రలు వస్తుంటారు. అయితే.. వారికి తగినట్లుగా అక్కడ సౌకర్యాలు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. బీచ్, సాగరసంగమానికి చేరుకోవడాని సరైన రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా పాలకాయతిప్ప నుంచి బీచ్ వరకు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. మడ అడవుల గుండా వేసిన తారురోడ్డు కొట్టుకుపోయి కంకర తేలింది. కనీసం నడిచి వెళ్లేందుకూ పనికిరాని విధంగా మారింది. ఎలాగో అలా తీరానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సాగరసంగమానికి వెళ్లేందుకూ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం పరంగా రవాణా లేకపోవడంతో ప్రైవేటు ఆటోలు, ట్యాక్సీలు పర్యాటకుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. కేవలం మూడు కిలోమీటర్ల దూరానికి రూ.500 కు పైగా వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చారిత్రకంగా, సంస్కృతికంగా ఎంతో ఘన ఖ్యాతి సాధించిన హంసలదీవి అభివృద్ధిని పాలకులు విస్మరించడంతో.. పర్యాటకుల మనస్సు చివుక్కుమంటోంది. కనీసం సౌకర్యాలు కల్పించి, రవాణా సదుపాయం కల్పించాలని టూరిస్టులు కోరుతున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చే వారు ఉల్లిపాలెం, పాలకాయతిప్ప మీదుగా.. రేపల్లె నుంచి వచ్చే వారు కోడూరు, పాలకాయతిప్ప నుంచి హంసలదీవి బీచ్ కు చేరుకోవచ్చు. రేపల్లె, మచిలీపట్నం కు హైదరాబాద్ కు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us