AP News: ఏపీలో విచిత్ర వాతావరణం.. బాబోయ్.! అక్కడ ఎండలు.. రాబోయే రోజుల్లో ఇలా
ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు కొన్ని చోట్ల చలి చంపుతుంటే.. ఇంకొన్ని చోట్ల ఎండలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఆ వాతావరణ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

‘వేసవి కాలం’ అంటే ఏప్రిల్, మే నెలలని టక్కున చెప్పేస్తారు. కానీ, వాతావరణ మార్పుల కారణంగా జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ముందుగానే వచ్చేసిందా అనే భావన కలుగుతోంది. ఏటా ఉష్ణోగ్రతల్లో రికార్డు స్థాయి పెరుగుదల నమోదవుతోంది. గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై పడుతోంది. ‘లానినా’ బలహీనపడటంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం నుంచి తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. కేరళలో జనవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండు రోజులుగా ఉక్కపోత ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ, తెలంగాణలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ మాజీ డీజీ కేజే రమేశ్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి