Vijayawada: విజృంభిస్తున్న విష జ్వరాలు.. అల్లాడుతున్న ప్రజలు
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గొడవర్రు గ్రామంలో ప్రజలు గత నెల రోజులుగా జ్వరాలు, కీళ్లనొప్పులు, దగ్గు, జలుబుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్య నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఉంది. కేవలం గొడవర్రు గ్రామంలోని గౌడ బజార్ ఒక్కదానిలోనే సుమారు 50 మంది ఈ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు..

కృష్ణా జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరు తర్వాత మరొకరు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో నీరసించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు మాత్రం త్వరగా తగ్గట్లేదు. జ్వరం వచ్చిన రెండు రోజుల్లోనే బాధితులు నీరసిస్తున్నారు. డెంగీ, మలేరియా లక్షణాలతో మరికొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. జిల్లాలో వివిధ ఆసుపత్రులను పరిశీలించగా జ్వరపీడితులు అధికంగా కనిపించారు.
ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఈ సమస్య గురించి తెలియజేసినా సాధారణ మందులతోనే కాలం వెళ్లదీస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అంతేకాక ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టామని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో విష జ్వరాలు బారిన పడటానికి కలుషిత నీరు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వం ఇప్పటికైనా డ్రైనేజీ , మంచినీటి పైప్ లైన్ లకు మరమ్మత్తులు చేసి జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








