Sri Mattam Hundi Income: చరిత్ర తిరగరాసిన మంత్రాలయం హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే రూ.4.83 కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలోని మంత్రాలయం హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఆరాధ్య దైవమైన రాఘవేంద్ర స్వామికి మూడు రాష్ట్రాల నుంచేకాకుండా దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మంత్రాలయం హుండీ ఆదాయం మరింత పెరిగింది..

కర్నూలు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలోని మంత్రాలయం దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఇక్కడి రాఘవేంద్ర స్వామి అంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఆరాధ్య దైవం. మూడు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సొంత దర్శనానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది. వీవీఐపీల తాకిడి కూడా పెరిగిందని స్పష్టమైందనడానికి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయాన్ని ఇటీవల లెక్కించారు.
డిసెంబర్ 22 నుంచి జనవరి 22 వరకు సంబంధించిన హుండీని లెక్కించగా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఏకంగా రూ. 4,80,33,154 వచ్చినట్లు దేవస్థానం మేనేజర్ మాధవ శెట్టి తెలిపారు. వీటితోపాటు బంగారు, వెండి ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా వచ్చింది. ఇంతవరకు జరిగిన హుండీ ఆదాయం లెక్కల్లో ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం అని మఠం అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




