CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది వరకు కార్మికులు మృతి చెందిన ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు.
సీఎం కీలక ఆదేశాలు
ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మందికిపైగా వరకు పని చేస్తున్నారని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
మరోవైపు ఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి నారాయణ దిగ్భ్రాంతి
అలాగే అగ్నిప్రమాద ఘటనపై మంత్రి నారాయణ సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించీ తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు.
బీజేపీ చీఫ్ దిగ్బ్రాంతి
ఇదిలా ఉండగా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి తక్షణమే ఆర్థిక సహకారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
