Jaggaiahpet: లిఫ్ట్ అడిగిన వ్యక్తిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ – అసలు ట్విస్ట్ ఏంటంటే
జగ్గయ్యపేటలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అభిమల్ల వెంకయ్య, అల్లూరి కృష్ణ మధ్య గొడవ హత్యగా మారింది. అయితే ఈ ఘటనలో మూడో నేత్రంగా పనిచేసిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. సాంకేతికత ద్వారా పోలీసులు కేసును ఈజీగా సాల్వ్ చేశారు.

న్యాయం, చట్టం పట్ల సామాన్యుడి విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ నేరస్థులను వెంటనే పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు తమ నిఘా వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తూ.. నేరాల్ని చేధించడంలో ప్రతిభ కనబరుస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు నెలల క్రితం ఏపీ తొలి నిఘా ప్రాజెక్టుగా 550 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పోలీసులు నేరాల నియంత్రణలో విజయవంతమవుతున్నారు. తాజాగా జరిగిన ఓ హత్య కేసులో సీసీ కెమెరాలు కీలక ఆధారంగా మారాయి.
తెల్లవారు జామున 5 గంటలకు జగ్గయ్యపేట వైన్షాప్ వద్ద అభిమల్ల వెంకయ్య అనే వ్యక్తి, అల్లూరి కృష్ణతో గొడవ పడాడు. గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చి రైతు బజారు వద్ద కృష్ణ రాయితో వెంకయ్యను తీవ్రంగా గాయపర్చాడు. గాయాలపాలైన కృష్ణ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అనంతరం తిరిగి వచ్చి వెంకయ్యపై ప్రతిదాడికి దిగాడు. ఈ సారి రాయితో అతని తలపై దాడి చేసి హతమార్చాడు. దాడి అనంతరం పారిపోవాలని ప్రయత్నించిన కృష్ణ.. మార్గమధ్యలో అటుగా బైక్పై వెళ్తున్న మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ను లిఫ్ట్ అడిగాడు. కానిస్టేబుల్ అప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా హత్య చేసింది అతనే అని గుర్తించి.. బైక్పై ఎక్కించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. కేవలం గంటల వ్యవధిలో కేసును చేదించి నిందితుడిని అరెస్టు చేశారు.
సీసీ కెమెరాలు జగ్గయ్యపేట పోలీసులకు మూడో నేత్రంలా మారాయి. వీటి సాయంతో అనేక హత్యలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, మహిళల మిస్సింగ్ కేసులు చేధించామని అధికారులు తెలిపారు. సాంకేతికను నేరాల నియంత్రణకు ఉపయోగించి.. ప్రజల భద్రతకు ముందడుగు వేస్తున్నామని పోలీసులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




