వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్!
భార్య భర్తల మధ్య కీచులాటలు షరా మామూలే. ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరని గొడవలకు కారణమవుతుంటాయి. సర్దుకుపోయేతత్వం ఏ ఒక్కరికీ లోపించినా ఆ కాపురం ఆల్లకల్లోలమే. తాజాగా ఓ జంట గొడవపడ్డారు. అందుకు కారణం వంటింట్లో స్టౌపై పెట్టిన పాలు పొంగడం. అంతే.. గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరిపెట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కడప, ఏప్రిల్ 20: ఎంతో విలువైన ప్రాణాలు చిన్న కారణాలకే కొందరు తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. సెల్ ఫోన్ ఇవ్వలేదని, రిమోట్ లాక్కున్నారనీ, ఎక్కువ సమయం ఫోన్లో గడపొద్దన్నారనీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో స్టౌ పై మరుగుతున్న పాలు పొంగాయని భార్యపై కోపంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్లోని కడపలో చోటు చేసుకుంది. ఎస్సై మహమ్మద్ రఫి తెలిపిన వివరాల మేరకు..
కడప జిల్లాలోని బాలాజీనగర్కు చెందిన వెంకట సుబ్బయ్య (53), అనురాధ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వెంకట సుబ్బయ్య గతంలో గల్ఫ్లో పని చేశాడు. ఇటీవల కడపకు వచ్చి ఆయన స్వగ్రామంలోనే ఓ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వెంకట సుబ్బయ్య, అనురాధ దంపతులు ప్రతి రోజు చిన్న చిన్న విషయాలకే కీచులాడుకునే వారు. ఈనేపథ్యంలో ఆదివారం భార్య అనురాధ ఇంట్లో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. కాసేపటికి పాలు బాగా మరిగి పొంగువచ్చింది. అనురాధ గమనించకపోవడంతో అవి పొంగి స్టౌవ్పై ఒలికాయి. గమనించిన భర్త వెంటక సుబ్బయ్య ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవా? అంటూ కోపంతో తలను గోడకేసి కొట్టుకున్నాడు.
దీంతో అతడి తలకు చిన్న గాయమైంది. భర్త చేష్టలకు భయపడిన భార్య బయటికి వచ్చి కూర్చుంది. భార్య పట్టించుకోకుండా బయటకు వెళ్లిందన్న కోపంతో భర్త ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నారు. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన భార్య అనురాధ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి వెంకట సుబ్బయ్యను కిందికి దించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరాంచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




