Andhra: జీవితాలను చిదిమేస్తుందేమో.. అక్కడి వారికి బండరాయి టెన్షన్
ఆ రాయికి ఎంతో హిస్టరీ ఉంది. ఈ బండ రాయి ఎత్తు 50 నుంచి 55 అడుగుల ఎత్తు ఉంటుందని స్థానిక జనం చెబుతున్నారు. దీని బరువు 6000 టన్నులు ఉంటుందని అధికారుల అంచనా. తీవ్రమైన ఎండల కారణంగా గతంలో ఆ బండరాయి రెండుగా చీలిపోయింది. దీంతో అది ఎప్పుడు విరిగి పడుతుందో అని స్థానికులు భయంతో రోజులు గడుపుతున్నారు.

కర్నూలు జిల్లాలో బాహుబలి కొండరాయి భయం రెండేళ్లు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉంది. గోనెగండ్ల మండల కేంద్రంలో ఎండ వేడికి సుమారు 55 అడుగుల ఎత్తు ఉన్న కొండరాయికి 2023లో పగుళ్లు వచ్చాయి. గత ఏడాది ఎండలకు అది నిలువుగా చిలింది. ఆ చీలిన బండ రాయిపై మరో రెండు రాళ్లు ఉన్నాయి. బండ రాయి పూర్తిగా రెండుగా విడిపోయినట్లుయితే.. దాని పైన ఉన్న రెండు రాళ్లు కింద పడిపోతాయి. ఈ రాయికి చుట్టు పక్కల 50 ఇళ్లు ఉన్నాయి. దీంతో స్థానికులు అది ఎప్పుడు పడిపోతుందో అని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోని ఆందోళనకు గురవుతున్నారు. తమ కాలనీ వాసులకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
మళ్లీ ఎండాకాలం రావడంతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కర్నూలు జిల్లాలో నమోదువుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అధికారులు మాత్రం ఎండాకాలం వచ్చినప్పుడల్లా కొండరాయిను తొలగిస్తామని హడావిడి చేసి, వేసవికాలం ముగిసిన తరువాత కనీసం దాని వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు. బండరాయి పగుళ్లలోకి గాలి లోపలికి వెళ్తూ పెద్ద ఎత్తున శబ్దలు వస్తున్నాయని, ఆ సౌండ్స్ వింటుంటే.. అది కింద పడుతుందని భయమేస్తుందని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంలో అయినా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.