Kishan Reddy: ప్రధాని మోడీ చెప్పారు.. ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఓ వైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా.. మరోవైపు అమరావతే రాజధాని ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ నిరసనలు కొనసాగుతున్నాయి.
ఓ వైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా.. మరోవైపు అమరావతే రాజధాని ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అంటూ మరోసారి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోడీ చెప్పారని వెల్లడించారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని.. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదంటూ కిషన్ రెడ్డి హితవు పలికారు. జనసేనాని పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంపై స్పందించారు. ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదంటూ సూచించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని.. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతీ రాజకీయ పార్టీకి ఉంటుందని అన్నారు.
కాగా.. ఏపీలోని గుంటూరు, ఏలూరు పర్యటనల్లో భాగంగా సోమవారం ఉదయం కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో అమరావతి రాజధాని సహా పలు విషయాలపై మాట్లాడారు.
ఇదిలాఉంటే.. ఏపీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. మూడు రాజధానులు ఉండాలని పేర్కొంటోంది. దీనిలో భాగంగా రాజధాని వికేంద్రీకరణ కోసం విశాఖ గర్జనను సైతం నిర్వహించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..