AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress President Election: ఖర్గే vs థరూర్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు షురూ.. ఎవరెక్కడ ఓటు వేస్తారంటే..?

137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.

Congress President Election: ఖర్గే vs థరూర్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు షురూ.. ఎవరెక్కడ ఓటు వేస్తారంటే..?
Congress President Polls
Shaik Madar Saheb
|

Updated on: Oct 17, 2022 | 11:09 AM

Share

కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్‌ని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చీఫ్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఢిల్లీలోని AICC కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ పోటీ పడుతున్నారు. గాంధీల కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఎలక్టోరల్‌ కాలేజీలోని PCC ప్రతినిధులు సహా మొత్తం 9వేల మందికి పైగా ఓటు వేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్‌ విధానంలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక బరిలో లేకపోవడం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, చిదంబరం, పలువురు నేతలు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పార్టీ చీఫ్‌ సోనియా, ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో 40 మంది ప్రతినిధులు అక్కడే ఓటు వేయనున్నారు. ఖర్గే కర్ణాటకలో, శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. ఈ నెల 19వ తేదీని ఓట్ల లెక్కింపు జరగనుంది. అదేరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో..

కర్నూలులో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన కాంగ్రెస్‌ నేతలంతా తమ ఓటు హక్కు ఇక్కడే వినియోగించుకుంటారు. ఓటు వేసేందుకు ఏపీకి చెందిన PCC డెలిగేట్స్ కర్నూలు చేరుకుంటున్నారు. ఏపీకి మొత్తం కర్నూలులోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు సహా 350 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

తెలంగాణలో..

కాంగ్రెస్ పార్టీ​ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం గాంధీభవన్​లో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 238 మంది పీసీసీ నేతలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్, అసిస్టెంట్​ రిటర్నింగ్​అధికారిగా రాజ బగేల్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏజెంట్లుగా ఖర్గే తరఫున షబ్బీర్ అలీ, మల్లు రవిలు వ్యవహరిస్తుండగా.. శశిథరూర్ తరఫున ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి శ్రీకాంత్, సంతోశ్​కుమార్ వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌ గాంధీభవన్ పోలింగ్‌ కేంద్రం దగ్గర ఓటేయడానికి వచ్చిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్డు తీసుకున్న సిబ్బంది.. దాన్ని పక్కనపెట్టి..మరో వ్యక్తిని లోనికి పంపారంటూ మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..