Andhra Pradesh: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. అదే జీవితం కాదు. చదువులేని వారు కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. వారిని స్పూర్తిగా చేసుకుని కూడా నచ్చిన రంగాల్లో రాణించవచ్చు. ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవడం ఎంత వరకు న్యాయం..

భోగాపురం, ఏప్రిల్ 14: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్ధుల ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజా ఫలితాల్లో కొందరు విద్యార్ధులు ఫెయిల్ కావడంతో పలు చోట్ల వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన జి చరణ్ ఫలితాలు వచ్చిన రోజే శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఫలితాలు రావడంతో అందరు విద్యార్థుల లాగానే చరణ్ తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు చెప్పడంతో వారు భయపడవద్దని, మళ్లీ పరీక్షలు రాయెుచ్చని ధైర్యం చెప్పారు. అనంతరం వారు పని మీద బయటకు వెళ్లగా చరణ్ ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు కొనఊపిరితో ఉన్న చరణ్ను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
ఫెయిల్ అవుతాననే భయంతో మరొకరు
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఫలితాలు రాకముందే శుక్రవారం (ఏప్రిల్ 11) నాడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బండిఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుదీశ్వరరెడ్డి అనే యువకుడు నంద్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే పరీక్షలు సరిగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రోజు రిజల్స్ వస్తాయని తెలిసి మరింత కలవరపడ్డాడు. ఫెయిల్ అయ్యానని తెలిస్తే అందరూ తనను అవమానిస్తారని ఏకంగా ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చాడు.
ఒక సబ్జెక్ట్ తప్పినందుకు జీవితం నుంచే తప్పుకున్న మరో విద్యార్ధిని
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామానికి చెందిన ముగశాల స్రవంతి (19) ఏప్రిల్ 12న వెలువడిన ఫలితాల్లో కెమిస్ట్రీ సబ్జెక్టు తప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి ఫలితాలు వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉండసాగింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తల్లి శ్యామల విజయనగరం వెళ్లింది. తండ్రి సూరిబాబు గ్రామ సమీపంలో పొలం పనులకు వెళ్లాడు. నానమ్మ, తాతయ్యలు ఇంటి ఆరుబయట కూర్చొని ఉండగా.. ఇంట్లోనే ఒంటరిగాఉన్న స్రవంతి.. ఇంట్లో శ్లాబు ఉక్కుకు ఉరివేసుకుంది. ఆరుబయట కూర్చొన్న నానమ్మకు ఇంట్లో ఏదో వేలాడుతున్నట్లు కనిపించి లోపలికి వెళ్లి చూడగా.. మరవకాలు ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారిని పిలిచింది. వారంతా వచ్చేటప్పటికే స్రవంతి విగత జీవిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని కిందకు దింపి విచారించి సుందరపేట ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు.
ఒక సబ్జెక్టులో ఫెయి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన మున్నం గోవర్ధనరెడ్డి, పార్వతమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రశాంత్రెడ్డి (18) చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. శనివారం ఇంటర్ ఫలితాలు విడుదలవగా ప్రశాంత్రెడ్డి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఉదయం తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.