AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఆకాశం చిల్లు పడేలా..! దంచి కొట్టిన తుఫాను వర్షాలు..

తుఫాను నేపథ్యంలో.. కోస్తా రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి. ఆకాశం చెల్లు పడిందా అన్నట్లు కొన్ని చోట్ల కొండపోత వర్షం కురిపించింది తుఫాను. జిల్లాల వారిగా ఒకసారి పరిశీలిస్తే.. రాయలసీమలోని తిరుపతిలో అత్యధికంగా వర్షపాతం రికార్డు అయింది. మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు 93.3 మిల్లీమీటర్లు.. అంటే 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసింది.

AP Weather: ఆకాశం చిల్లు పడేలా..! దంచి కొట్టిన తుఫాను వర్షాలు..
Rains
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Dec 06, 2023 | 8:55 AM

Share

వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే మిచాంగ్ తుఫాను బీభత్సమే సృష్టించింది. తీర ప్రాంతంపై విరుచుకుబడింది. తీవ్ర తుఫానుగానే బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచాంగ్.. ఆ తర్వాత ఉత్తర దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీన పడుతుంది. తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా కాస్త బలహీనపడి.. దక్షిణ కోస్తా గుండా ఉత్తర దిశగానే ప్రయాణిస్తూ..  తీవ్ర వాయుగుండం గాను.. ఆ తర్వాత వాయుగుండం గాను.. క్రమంగా బలహీనపడుతూ అల్పపీడనంగానూ మారబోతోంది.

సముద్రం నుంచి భూభాగంపైకి వచ్చాక తుఫాను గంటకు పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తుఫాను తీరం దాటాక కూడా దాని ప్రభావం చూపుతూనే ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమలో ఇప్పటికే వర్షాలు దంచి కొట్టగా.. ఉత్తరకోస్తాలను వర్షాలు తీవ్రతరమయ్యాయి. తుఫాను క్రమంగా బలహీనబడుతున్నప్పటికీ.. అది ప్రయాణించే ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలపై ఇంకా గాలుల తీవ్రత, వర్షాలు తీవ్రత కొనసాగుతూనే ఉంది. క్రమంగా.. ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

అత్యధికంగా.. అక్కడే…!

తుఫాను నేపథ్యంలో.. కోస్తా రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి. ఆకాశం చెల్లు పడిందా అన్నట్లు కొన్ని చోట్ల కొండపోత వర్షం కురిపించింది తుఫాను. జిల్లాల వారిగా ఒకసారి పరిశీలిస్తే.. రాయలసీమలోని తిరుపతిలో అత్యధికంగా వర్షపాతం రికార్డు అయింది. మంగళవారం సాయంత్రం ఏడు గంటల వరకు 93.3 మిల్లీమీటర్లు.. అంటే 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసింది. ఆ తర్వాతి స్థానం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. 86.1 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా ఎనిమిదిన్నర సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. మూడో స్థానంలో.. తుఫాను తీరం దాటిన సమీప ప్రాంతమైన బాపట్ల జిల్లాలో 64.4 మిల్లీమీటర్లు అంటే.. దాదాపుగా ఆరున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కృష్ణా జిల్లాలో 55 మిల్లీమీటర్లు ( 5.5 సెంటీమీటర్లు) , నెల్లూరు జిల్లాలో 54.9 మిల్లీమీటర్లు ( 5.4 సెంటీమీటర్లు ) అత్యధిక వర్షపాతం నమోదయింది.

ఇక గుంటూరు జిల్లాలో 3.3 సెంటీమీటర్లు, విశాఖలో 3.1, అన్నమయ్య జిల్లాలో 3, కాకినాడలో 2.7, తూర్పుగోదావరి, వైయస్సార్ జిల్లాల్లో 2.4, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 2.3, అనకాపల్లిలో 2.2, చిత్తూరులో 2.1, విజయనగరం జిల్లా లో 1.2, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక సెంటీమీటర్ వర్షపాతం రికార్డు అయింది. మిగిలిన జిల్లాలను మోస్తరు వర్షం కురిసింది. అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం అనంతపురం జిల్లాలో కురిసింది. ఏపీ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే సగటున 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గడచిన నాలుగు రోజుల్లో ఏపీలో అత్యధికంగా మంగళవారం నాడే వర్షపాతం రికార్డ్ అయింది. నాలుగో తేదీన 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం ఏపీలో రికార్డు కాగా.. దాదాపుగా దానికి రెట్టింపుగా మంగళవారం ఒక్కరోజే వర్షం కురిసినట్టు అంచనాలు చెబుతున్నాయి.

– తుఫాను క్రమంగా బలహీనపడి… ఏపీ భూభాగం దాటినంతవరకు.. వర్షాలు ఆయా ప్రాంతాల్లో కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సిస్టం ఉత్తరాంధ్ర వైపు వెళుతున్న తరుణంలో.. దక్షిణ కోస్తా, రాయాలసీమ జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలు క్రమంగా తగ్గి ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us