Alert: వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి
వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ నకిలీ ప్రకటనలు, ఫేక్ లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే వినియోగదారులనే టార్గెట్ చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ యాడ్స్ పెడుతున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలుకుతున్నారు. అయితే ఇలాంటి సందేశాలు ఎక్కువగా సైబర్ మోసాలకు సంబంధించినవే కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం వినియోగదారులు ఎప్పుడూ ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండటం ద్వారానే ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు.
Also Read: 9 నెలలు నిండాక ప్రవేట్ ఆస్పత్రికి గర్భిణీ.. అక్కడ స్కాన్ చేయగా షాకింగ్ నిజం
