AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan: వైసీపీ త్రిశూల వ్యూహం.. గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం.. వాళ్ల కోసం జగన్ ప్రచారం

రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లను గెలిపించడం కోసం అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. జగన్‌ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు.

CM YS Jagan: వైసీపీ త్రిశూల వ్యూహం.. గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం.. వాళ్ల కోసం జగన్ ప్రచారం
Ys Jagan
Balaraju Goud
|

Updated on: May 03, 2024 | 11:06 AM

Share

రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లను గెలిపించడం కోసం అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. జగన్‌ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు. వైసీపీ కోసం విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వాలారు. త్రిశూల వ్యూహంతో ముందుకు సాగుతోంది వైసీపీ. అసలేంటి ఈ త్రిశూల వ్యూహం?

లోకల్‌గా తమ గెలుపు కోసం వైసీపీ అభ్యర్ధుల ప్రచారం. వాళ్ల గెలుపు కోసం సిద్ధం అంటూ జగన్‌ ప్రచారం. జగన్‌ కోసం తామంతా సిద్ధం అంటూ ఎన్నారైల ప్రచారం. ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థులు కష్టపడుతుంటే, వాళ్లను గెలిపించడం కోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్‌. మొదట సిద్ధం, తర్వాత మేమంతా సిద్ధం అంటూ సభలు, బస్సు యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జగన్‌. తాజాగా దేశవిదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు, మేము సైతం అంటూ వైసీపీ కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచారపర్వంలో త్రిశూల వ్యూహంతో ముందుకు దూకుతోంది వైసీపీ.

సిద్ధం అంటూ జగన్‌ ప్రచారం చేస్తుంటే…జగన్‌ గెలుపు కోసం తామంతా సిద్ధం అంటున్నారు ఎన్నారైలు. వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్నారైలు..ఇవాల్టి నుంచి బస్సు యాత్రకు సంసిద్ధమయ్యారు. వీళ్లంతా బృందాలుగా విడిపోయి…నాలుగు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీకి ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరిస్తారు. ఈ బస్సు యాత్రను..సజ్జల ప్రారంభించారు.

ఇవాళ జగన్ ప్రచార షెడ్యూల్

ఇక ప్రచారానికి ఒకరోజు బ్రేక్‌ ఇచ్చిన జగన్…తాడేపల్లిలోని తన నివాసంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత, మరింత ఉధృతంగా ప్రచారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నిత్యం నాలుగు లేదా 5 నియోజకవర్గాలను కవర్‌ చేసే విధంగా జగన్‌ ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శుక్రవారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు జగన్. ఉదయం నరసాపురం స్టీమర్‌ సెంటర్‌లో జరిగే సభలో జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కి పెదకూరపాడు క్రోసూరు సెంటర్‌లో సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు కనిగిరి పామూరు బస్టాండ్ దగ్గర జరిగే సభలో జగన్‌ పాల్గొంటారు. అటు వైసీపీ అభ్యర్థుల ప్రచార తీరు…ఇటు జగన్‌ సభల హోరు, మరోవైపు ఎన్నారైల బస్సు యాత్రల జోరు… ఇలా త్రిశూల వ్యూహంతో వైసీపీ ముందుకు దూసుకెళుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…