AP Politics: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో హీటెక్కిన చంద్రగిరి పాలిటిక్స్.. అల్లర్లకు బాధ్యులెవరు..? కారకులెవరు..?

తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయం ఇప్పుడు అట్టుడుకుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు బాధ్యులు అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. చంద్రగిరి అల్లర్ల పై ఒక్కో పార్టీదీ ఒక్కో వాదన. పోలింగ్, అనంతరం జరిగిన హింస రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ దాడులకు కారకులెవరన్న దానిపై చర్చ నడుస్తోంది.

AP Politics: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో హీటెక్కిన చంద్రగిరి పాలిటిక్స్.. అల్లర్లకు బాధ్యులెవరు..? కారకులెవరు..?
Chevireddy Bhaskar Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 28, 2024 | 10:34 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయం ఇప్పుడు అట్టుడుకుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు బాధ్యులు అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. చంద్రగిరి అల్లర్ల పై ఒక్కో పార్టీదీ ఒక్కో వాదన. పోలింగ్, అనంతరం జరిగిన హింస రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ దాడులకు కారకులెవరన్న దానిపై చర్చ నడుస్తోంది.

మే 13, 14 న జరిగిన ఘటనలపై తిరుపతి, చంద్రగిరి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. మరోవైపు సిట్ విచారణ కూడా జరుగుతోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు నెలకొన్నాయి. మరోవైపు పోలీస్ పికెట్లు కొనసాగుతుండగా నివురుగప్పిన నిప్పులా పరిస్థితి మారింది. కేంద్ర పారా మిలిటరీ బలగాలు కూడా మొహరించాయి. ఎన్నికల కమిషన్ కూడా చంద్రగిరి అల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలా చంద్రగిరి అల్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోగా, మరోవైపు అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, పిర్యాదులు చేసుకుంటున్న వైసీపీ, టీడీపీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

నాలుగు రోజుల క్రితం తిరుపతి SVU పోలీస్టేషన్ లో సిట్ విచారణకు హాజరైన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఘటనపై DSP రవి మనోహరాచారికి వివరించారు. మే 14న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై తీరును వివరించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజ్‌ను DSPకి అందజేసిన నాని, అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు. కేసుల్లో A1 నుంచి A9 వరకు దాడికి పాల్పడిన నిందితులు ఉన్నారని, మిగిలిన వారంతా అమాయకులన్న నాని భౌతికంగా లేకుండా చేసేందుకు చంపాలని చూసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ లేనన్నారు. అసలు పాత్రధారులు, సూత్రధారులను వదిలేశారన్న నాని 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. హత్యాయత్నం చేసిన వైసీపీ కార్యకర్తలను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు పులివర్తి నాని.

ఇక చంద్రగిరి అల్లర్లపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసారు. పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేస్తున్న ఆరోపణలపై ఎస్పీకి వివరించిన చెవిరెడ్డి, అనంతరం చంద్రగిరి, తిరుపతిలో జరిగిన అల్లర్లపై మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు. గొడవలకు సంబంధించిన వీడియోలను డిస్ ప్లే చేసి ఘటనల తీరును వివరించారు. నాని భార్య కూడా మహానటిలా నటించిందని వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. నామినేషన్ సమయంలో RDO ఆఫీసు వద్ద తన కారుపై దాడి చేశారన్న చెవిరెడ్డి, కూచివారిపల్లిలో చిన్న గొడవను అడ్డంపెట్టుకుని దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ నేత ఇల్లుతో సహా రెండు కార్లు ద్వంసం చేశారన్నారు. ఒక అబ్బాయిని కొట్టారన్నారు చెవిరెడ్డి. మహిళ యూనివర్సిటీలో నానిపై దాడి చేయాలన్న ఉద్దేశం భానుది కాదన్నారు చెవిరెడ్డి. జరిగిన దాడిలో నానికి ఎలాంటి గాయాలు కాలేదని, రెండు గంటల తర్వాత వీల్ చైర్ ఉన్నాడు‌ని ఇదంతా డ్రామా అన్నారు చెవిరెడ్డి. అసుపత్రిలో ఫేస్ మాస్క్ లు, వెంటిలేటర్ ను ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాలేదన్న చెవిరెడ్డి గొడవల్లో అమాయకులు ఇబ్బంది పడ్డారన్నారు.

ఇక టీడీపీ అభ్యర్థి నానిపై దాడుల వ్యవహారం నాటకమంటూ చెవిరెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్ కు పోటీగా, చెవిరెడ్డి అబద్ధం అంటూ నాని కూడా మీడియా ప్రజెంటేషన్ నిర్వహించారు. తిరుపతిలో చంద్రగిరి అల్లర్లు, తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు నాని. చెవిరెడ్డి ఒక అపరిచితుడన్నారు. సమ్మెటతో కొట్టడం వల్ల తల, భుజంపై గాయాలు అయ్యాయని, చంపాలని తనపై దాడి జరిగిందన్నారు. నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారన్నారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్న చెవిరెడ్డి ఇప్పటి దాక 28 కేసులు పెట్టించారన్నారు నాని. ఐదేళ్ళలో చేసిన అక్రమాలే చెవిరెడ్డి ఓటమికి కారణమన్నారు. తప్పక గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేసిన నాని, తనపై హత్యాయత్నం వెనుక పాత్ర లేదని చెవిరెడ్డి ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు పులివర్తి నాని.

ఇలా విమర్శలు, చాలెంజ్‌లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లతో చంద్రగిరి రాజకీయం వేడెక్కి పోగా, ఈవీఎంలలో దాగి ఉన్న ఫలితం వచ్చాక చంద్రగిరి ఇంకెంత రణరంగానికి వేదిక కాబోతుందో వేచి చూడాల్సి ఉంది..!!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…