AP Elections 2024: ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమావేశం.. ఏపీలో ఏర్పాట్లపై సీఎస్ వివరణ..
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.ఇప్పటికే రాష్ట్రానికి పలువురు ప్రత్యేక పరిశీలకులను పంపించిన సీఈసీ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.ఇప్పటికే రాష్ట్రానికి పలువురు ప్రత్యేక పరిశీలకులను పంపించిన సీఈసీ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అత్యంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా దిశానిర్ధేశం చేసింది. ఎన్నికల నిర్వహణ, జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల అధికారులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతి యుతంగా, హింసా రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేయాలని రాజీవ్ కుమార్ ఎన్నికల యంత్రాగానికి స్పష్టం చేశారు. రానున్నఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణ, సెన్సిటివిటి, నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే, ఫెయిడ్ హాలిడే, అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై చర్చించారు.
ఏపీకి సంబంధించి పలు కీలక సూచనలు చేసారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్ వంటివి పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీ, సీఈఓలకు సూచించారు.ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు ఎక్కడైనా తనిఖీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయన్న సీఈసీ.. అలాంటి చర్యలను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు మరింత నిఘా పెంచాలన్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వాటి కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను సీఎస్ జవహర్ రెడ్డి సీఈసీకి వివరించారు.
ఏపీలో 91 పోలింగ్ కేంద్రాలపై మావోయిస్టుల ఎఫెక్ట్..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు వివరించారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 258 కోట్ల రూపాయలు విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్రంతో ఐదు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులను కలిగి ఉన్నాయన్నారు సీఎస్. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీఈసీకి తెలిపారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు. శాంతి భద్రతల అంశానికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా, ఛతీష్ఘడ్ నుండి కొంత మేర మావోయిస్టుల సమస్య ఉందని ఆ సమస్యను అధిగమించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, 632 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నట్లు సీఎస్ వివరించారు. సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా, ఛత్తీస్ గడ్ నుంచి కొంత వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉందని.. ఆయా ప్రాంతాల్లో 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు సీఈసీకి డీజీపీ వివరించారు. ఇక జిల్లాల వారీగా కూడా తీసుకుంటున్న చర్యలను సీఈసీకి రాష్ట్ర అధికారులు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..