Big News Big Debate: గత ఐదేళ్లుగా ఏపీని ముంచెత్తున్న తుఫానులు.. జరిగిన నష్టమెంత? బాధితులకు కేంద్ర, రాష్ట్ర సర్కార్ ఇచ్చే భరోసా ఏంటి?
ఊళ్లన్నీ చెరువులుగా మారాయి. చెరువుల అనవాళ్లు మాయమయ్యాయి. కొన్ని కాలనీలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎటూ చూసినా వరదనీరే. ఎక్కడ చూసినా విషాదమే. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు వరుణుడి సృష్టించిన విలయంతో చిగురుటాకులా వణుకుతోంది.
Big News Big Debate: ఊళ్లన్నీ చెరువులుగా మారాయి. చెరువుల అనవాళ్లు మాయమయ్యాయి. కొన్ని కాలనీలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎటూ చూసినా వరదనీరే. ఎక్కడ చూసినా విషాదమే. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు వరుణుడి సృష్టించిన విలయంతో చిగురుటాకులా వణుకుతోంది. కనీవినీ ఎరుగని ఉపద్రవంలో బాధితులకు రాష్ట్రం అండగా ఉన్నా.. విపత్తు వేళ కేంద్రానిది మాట సాయమేనా? తక్షణసాయం ఎందుకు ప్రకటించడం లేదు. ఒకప్పుడు గుజరాత్, బీహార్ రాష్ట్రాలకు వేల కోట్లు అత్యవసర సాయం ప్రకటించిన సెంటర్.. ఏపీ స్టేట్ను చిన్నచూపు చూస్తోందా.
ఎటు చూసినా విషాదమే. ఎక్కడ చూసినా వరద సృష్టించిన బీభత్సమే. సమస్తం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు లక్షలమంది బాధితులు. అధికారిక లెక్కల ప్రకారం 34 మంది చనిపోయారు. మరో 10 మంది వరకూ గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 NDRF, 8 SDRF బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. రెండు హెలికాప్డర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. మరో 3 హెలికాప్టర్లు అందుబాటులో ఉంచారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే 25 లక్షలు ఇవ్వాలని ఏకంగా కేబినెటే తీర్మానించింది. ఇప్పటికే మృతిచెందిన 90శాతం కుటుంబాలకు సాయం అందించారు. ఇక దెబ్బతిన్న ఇళ్లకు కూడా ఆర్ధికసాయం వెంటనే ఇవ్వాలని CM జగన్ ఆదేశించారు. దాదాపు 8లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది ప్రభుత్వం.
రాష్ట్రం తన పరిధిలో సాయం అందిస్తున్నా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ మాటసాయమే దక్కింది. ఇంకా ఎలాంటి తక్షణ సాయం అందలేదు. క్లిష్టమైన ఈ సమయంలో కేంద్రం నుంచి ఆర్ధికంగా అండ దొరుకుతుందని ఆశించినా ఎలాంటి ప్రకటనా రాలేదు. బృందాలు వచ్చి అంచనా వేసి నివేదిక ఇచ్చిన తర్వాతే సాయం అంటే ఎన్ని నెలలు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో తుఫానులు ఇచ్చిన హామీలే పూర్తిగా నెరవేర్చలేదు. కోవిడ్ కారణంగా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న వాదన బలంగా ఉంది. గతంలో గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వరదలు వస్తే స్వయంగా వెళ్లి పరిశీలించిన PM మోదీ, తక్షణ సాయం ప్రకటించిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. మరి కన్నీటిసీమగా మారిన రాయలసీమపై కేంద్రానికి కనికరం లేదా? స్వయంగా ఉపరాష్ట్రపతి కూడా ప్రధానితో మాట్లాడారు. అయినా సాయంపై ప్రకటన మాత్రం రాలేదు.