Andhra Pradesh: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక ప్రకటన.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా జరిగిందంటూ..
ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తుందంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పంచాయతీ రాజ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కలవరపాటుకు గురిచేశాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందించారు. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇక పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపును ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సజ్జల పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే వార్తలు ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ జేఏసీ అమరావతి, ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు సజ్జల
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..