AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ATM కార్డు సైజ్‌లో రేషన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరింత ఆధునిక, సురక్షితమైన రేషన్ కార్డులను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మే నెల నుంచి ATM కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ATM కార్డు సైజ్‌లో రేషన్ కార్డులు
Minister Nadendla Manohar
Follow us
Eswar Chennupalli

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 01, 2025 | 4:56 PM

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ కోసం ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను చేపట్టారు. ఏప్రిల్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవైసీ పూర్తైన వెంటనే, మే నెల నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కొత్త కార్డుల ప్రత్యేకతలు

ఇప్పటివరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల సైజును తగ్గించి, ATM కార్డు సైజులో తయారు చేయనున్నారు. అయితే, అందులోని అన్ని వివరాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా, కొత్త రేషన్ కార్డుల్లో ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా ప్రవేశపెట్టనున్నారు.

QR కోడ్: ప్రతి కార్డుపై ప్రత్యేకమైన QR కోడ్ ఉండటం వల్ల, దాన్ని స్కాన్ చేసి వివరాలను వెరిఫై చేసుకోవచ్చు.

సురక్షితమైన డిజైన్: కార్డులో వ్యక్తుల ఫోటోలు ఉండవు, గత ప్రభుత్వ విధానంలా ఫోటోలు ప్రింట్ చేయడం జరుగదని మంత్రి స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యుల జోడింపు & తొలగింపు: కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులను చేర్చే, తొలగించే, అలాగే స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.26 లక్షల రేషన్ కార్డులు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4.26 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈకేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎవరెవరికి కొత్త కార్డులు మంజూరు చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.

ప్రజలకు మరింత లబ్ధి

ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్మార్ట్ కార్డు ఫార్మాట్‌లో ఉండటంతో పాటు, రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.