ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వలోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన 95 శాతం హామీలను నెరవేర్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి స్వంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ. 13,500 కోట్ల సహాయాన్ని అందిస్తున్నామని, రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్ వెల్లడించారు. రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు.ఆమూల్ పాల వెల్లువ కింద రూ. 9,899 కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నామన్నారు.రూ. 3,1777 కోట్లతో నాలుగు షిపింగ్ హర్బర్ల నిర్మాణాన్ని చేపట్టామని గవర్నర్ గుర్తు చేశారు.
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా నవరత్నాల పథకం ఉందన్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టుగా చెప్పారు. పేద, బడుగు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గవర్నర్ తెలిపారు. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూల్స్, కాలేజీల రూపు రేఖలు మారాయని గవర్నర్ గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అమలు చేస్తున్నామన్నారు. పేద విద్యార్ధులకు జగనన్న అమ్మఒడి పథకం బాసటగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్ధులకు ఎంతో ప్రయోజం దక్కుతుందన్నారు గవర్నర్. విద్యను భవిష్యత్తుకు పాస్పోర్టుగా తమ ప్రభుత్వం భావిస్తోందని గవర్నర్ తెలిపారు.
విద్యారంగం అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గోరుముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు లబ్ది దక్కుతుందని చెప్పారు. అక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. విద్యారంగం అభివృద్దిపై ఇప్పటికే ప్రభుత్వం రూ. 34,619 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నామన్నారు. YSR చేయూత ద్వావరా 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు సహాయం చేస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు సున్నా వడ్డీని అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. ప్రతి నెల 62 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందిస్తున్నామని గవర్నర్ వివరించారు.