AP CM YS Jagan: ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ప్రత్యేక బోనస్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ సమీక్ష
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారంతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష.
AP CM YS Jagan Grain Procurement: రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు.
ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై అన్నదాతలకు ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదన్నారు సీఎం జగన్. తరచుగా రైతులతో అధికారులు సమన్వయ పరుచుకోవాలన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవన్ని సీఎం.. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలన్నారు.
ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదన్న సీఎం.. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది నియమించాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలన్నారు. వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారి నుంచి నేరుగా కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
అలాగే, అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బందితో పాటు కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అలాగే, రైతుల ఫిర్యాదు కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి, పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్ను పెట్టాలని సీఎం ఆదేశించారు.. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు చెప్పే సమస్యలను సామరస్యంగా వినాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో ఉన్న జేసీలనుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున ధాన్యం కొనుగోలు 42,237 మెట్రిక్టన్నులకు చేరిందని అధికారులు.. సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయాలని ఆధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Andhra Pradesh: బంపర్ ఆఫర్.. అక్కడ మటన్ కేజీ 50 రూపాయలే.. ఎగబడ్డ స్థానికులు