AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan New Friend: దాయాదితో జతకట్టిన మరో దేశం.. భారత్‌కు పొంచివున్న ప్రమాదం.. ఎలా అంటే?

దాయాది దేశానికి మరో దేశం అండగా నిలుస్తోంది. పాకిస్తాన్‌తో అవసరాలున్న టర్కీ ఆ దేశానికి ఆధునిక యుద్ధతంత్రాన్ని బోధిస్తూ.. మన దేశానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.

Pakistan New Friend: దాయాదితో జతకట్టిన మరో దేశం.. భారత్‌కు పొంచివున్న ప్రమాదం.. ఎలా అంటే?
Pakistan
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2021 | 5:08 PM

Share

Pakistan New Friend becoming threat to India: దాయాది దేశానికి మరో దేశం అండగా నిలుస్తోంది. పాకిస్తాన్‌తో అవసరాలున్న టర్కీ ఆ దేశానికి ఆధునిక యుద్ధతంత్రాన్ని బోధిస్తూ.. మన దేశానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం కావడంతో టర్కీ తాము ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు పాకిస్తాన్‌కు అండగా నిలుస్తోంది. పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీలో తమకు సహకరిస్తే.. దాయాది దేశానికి పెద్ద ఎత్తున ఆధునిక డ్రోన్లను అందించేందుకు టర్కీ సిద్దమవుతోంది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఇంటలెజెన్స్ తాజాగా షాకింగ్ విషయాలను పసిగట్టింది. దానికి సంబంధించిన కథనాలిపుడు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇటీవల టర్కీ ల్యాండ్‌ఫోర్స్‌ కమాండర్‌ ఉమిత్‌ దున్‌దార్‌ పాకిస్తాన్‌లో పర్యటించారు. దీన్ని సాధారణ పర్యటనగా భావించలేమని ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చాటిచెబుతోంది. ఈ పర్యటనలో ఆయనకు నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డును పాకిస్తాన్ పాలకులు ప్రకటించారు. దీని వెనుక డ్రోన్‌ టెక్నాలజీ కోసం పాక్‌ ప్రయత్నాలున్నాయిన తెలుస్తోంది. ఈ టెక్నాలజీని సాధించేందుకు టర్కీని పాక్ పాలకులు మచ్చిక చేసుకుంటున్నారు. అందులో భాగంగానే పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం నిషాన్-ఈ-ఇంతియాజ్‌కు టర్కీ కమాండర్‌కు ఇచ్చారని తెలుస్తోంది. పాక్‌తో కలిసేందుకు టర్కీకి ‘అణు’ అవసరాలు ఉన్నాయి. ఇక పాక్‌ చేతికి టర్కీ డ్రోన్‌ టెక్నాలజీ, నాటో సైనిక కూటమి వ్యూహాలు వస్తే భారత్‌కు నిస్సందేహంగా ప్రమాదమేనని ఆర్మీ ఇంటలిజెన్స్ అంఛనా వేస్తోంది.

ప్రపంచంలో అత్యంత ఆధునాతనమైన డ్రోన్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో టర్కీ ఒకటి. ఆ దేశం వద్ద బేర్తర్‌ టీబీ2 డ్రోన్లున్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. దీనికి తోడు ఆ దేశం వద్ద నాటో దళాలు అనుసరించే రోబోటిక్‌ యుద్ధతంత్ర వ్యూహాలున్నాయి. వీటిని అమెరికా నేతృత్వంలోని సేనలు అఫ్గన్‌ యుద్ధంలో వాడాయి. ఆ నాటో సేనల్లో టర్కీ కూడా ఒక భాగం. గతేడాది టర్కీ వీటిని మొత్తం నాగర్నో కారాబాకు యుద్ధానికి ముందు అజర్‌ బైజన్‌కు అందజేసింది. అంతేకాదు, సిరియాలోని టర్కీ కిరాయి మూకలకు కూడా సహాయంగా పంపింది. తాజాగా పాక్‌ కూడా అటువంటి సాయాన్నే కోరుకుంటోంది. ఆ సైనిక వ్యూహాలను, డ్రోన్ టెక్నాలజీని అందజేసేందుకు టర్కీ పాలకులు కూడా సిద్దంగా వున్నారని తెలుస్తోంది.

అఫ్గన్‌ మారుమూల ప్రాంతాలు, పాక్‌-అఫ్గన్‌ సరిహద్దులకు అమెరికా ఇన్‌ఫాంట్రి, మెరైన్‌,నేవీ సీల్‌, సీఐఏ పారామిలటరీ ఫోర్సులతో కూడిన సైనిక బృందాలను తొలుత పంపించింది. వీరు అఫ్గన్‌ నేషనల్‌ ఆర్మీతో కలిసి పనిచేశారు. అమెరికా బృందాలు స్పెషల్‌ ఆపరేషన్‌ ఫోర్సెస్‌ లేజర్‌ అక్విజేషన్‌ మార్కర్‌ అనే ప్రత్యేకమైన పరికరాన్ని వినియోగించాయి. దీంతో కొండలపై ఉన్న తాలిబాన్ల స్థావరాలను గుర్తించి లేజర్‌ సాయంతో ప్రత్యేకంగా మార్కింగ్‌ చేశాయి. అంటే లక్ష్యాలను గుర్తించడం అన్నమాట. ఆ తర్వాత సంకీర్ణ నాటో దళాల విమానాలు, డ్రోన్లు రంగంలోకి దిగి.. ఆ లేజర్‌ మార్కింగ్‌ను తమ గైడెడ్‌ జేడీఎఎం బాంబులకు లాక్‌ చేసి ప్రయోగించేవి. అవి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించేవి. ఇదే తరహాలో అజర్‌ బైజన్‌ కమాండో దళాలు అర్మేనియా దేశంలోకి చొరబడి తమ రాకెట్‌ లాంఛర్లకు లక్ష్యాలను నిర్దేశించాయి. అజర్‌ బైజన్‌, దాని మద్దతు దళాలకు టర్కీ మిలటరీ అకాడమీ, పాకిస్థాన్‌లో నాటో తరహా శిక్షణ లభించినట్లు ‘రేడియో ఫ్రీ యూరప్‌’ అనే సంస్థ ఇటీవల వెల్లడించింది. టర్కీ దళాలకు అఫ్గన్‌లో పనిచేసిన అనుభవంతో నాటో వ్యూహాలను వంటబట్టించుకొంది.

అజర్‌ బైజన్‌ యుద్ధానికి సిద్ధమవ్వడంలో భాగంగా టర్కీ సైనిక బలగాలతో గతేడాది వేసవిలో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ క్రమంలో డ్రోన్లను ఎలా వినియోగించాలి..? ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలన్న విషయాన్నిక్షుణ్ణంగా నేర్చుకొంది. ఉక్రెయిన్‌ నుంచి సెకెండ్ వరల్డ్ వార్ కాలం నాటి ఏఎన్‌-2ఎస్‌ విమానాలను కొనుగోలు చేసింది. వీటిని రిమోట్‌ విమానాలుగా మార్చేసింది. అర్మేనియా ఎయిర్‌ డిఫెన్స్‌లు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు వీటిని ఎరగా వేసింది. ఆ తర్వాత ఎయిర్‌ డిఫెన్స్‌లపై డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. టర్కీ కొన్నేళ్లుగా అణ్వాయుధ సామర్థ్యాన్ని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ అణ్వస్వ్ర సామర్థ్య దేశంగా వున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు డ్రోన్ల అవసరం చాలా ఉంది. పరస్పరం అవసరాలు ఉండటంతో సాంకేతికత బదలాయించుకొనే ప్రమాదం ఉంది. ఇరు దేశాలు కశ్మీర్‌ విషయంలో ఒకే వాదన వినిపిస్తున్నాయి. కశ్మీర్‌ నుంచి వెళ్లేవారు ఐఎస్‌ఐతో భేటీ అయ్యేందుకు టర్కీ ఒక వేదికగా మారిపోయింది.

ఇక ఇటీవల పరిణామాలు చూస్తే.. డ్రోన్ల కోసం పాకిస్తాన్ ఎంత వేగంగా ప్రయత్నిస్తోందో అర్థం అవుతుంది. జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరగడంతో మన దేశ రక్షణ వ్యవస్థల్లో కొన్ని లోపాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పాక్‌ నిఘా డ్రోన్లు, సాయుధ డ్రోన్లతో సాధన చేయడం మొదలుపెట్టినట్లు ‘ది స్టేట్స్‌మన్‌’ కథనం వెల్లడించింది. భారత్‌ 10 యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినా.. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదిన్నర పడుతుంది. టర్కీ వద్ద మానవ రహిత విమానాల కొనుగోలుకు పాక్‌ అధికారుల పర్యటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టర్కీ పదాతి దళాల జనరల్‌ పాక్‌ పర్యటనకు వచ్చారు. రక్షణ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ఆయన సేవలకు నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డును ప్రకటించింది. గతేడాది పాక్‌ జనరల్‌ నదీమ్‌ రజాకు ది లిజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డును టర్కీ ప్రకటించింది.

ALSO READ: తెలంగాణలో పొలిటికల్ జోష్.. రెండున్నరేళ్ళ ముందే దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు