లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మజీద్ మీర్ కు(Sajid Majeed Mir) పాకిస్తాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది. 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో సాజిద్ మజీద్ మీర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంతే కాకుండా ఇతనిపై ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలతో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన పాకిస్తాన్లోని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (Lahore Anti-Terrorism Court) మజీద్ మీర్ కు 15 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా రూ.4 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో మజీద్ మీర్ అరెస్టు అయినప్పటి నుంచి లాహోర్లోని కోట్లఖ్పత్ జైల్లో ఉన్నాడు. అయితే గతంలో మీర్ చనిపోయినట్లు పాకిస్తాన్(Pakistan) ప్రకటించింది. ఈ ప్రకటనను నమ్మని పశ్చిమ దేశాలు.. మృతి చెందినట్లు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశాయి. అంతే కాకుండా భారత్ మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలోనూ మీర్ ఉన్నాడు. 40 ఏళ్ల సాజిద్పై అమెరికా గతంలోనే 50 లక్షల డాలర్ల నజరానా ప్రకటించింది.
2008 నవంబరు 11న పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబయి చేరుకున్న సాజిద్ నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతి చెందారు. ముంబయి పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు లాహోర్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అతడు శిక్ష అనుభవిస్తున్నాడు.
పాకిస్థాన్లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి 2008 నవంబరు 26న అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్లో ఉన్న దేశ విదేశీయులను బందీలుగా చేసుకున్నారు. లోపల దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది చనిపోగా.. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ముంబై నగరం భయంతో వణికిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..