AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Violence: అఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహం

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పట్నించి తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ప్రతీరోజు ఓ హింసాత్మక ఘటనకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రయాణికులున్న...

Afghanistan Violence: అఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహం
Taliban Terrorists
Rajesh Sharma
|

Updated on: Jun 06, 2021 | 6:50 PM

Share

Afghanistan Violence Taliban violence increasing: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పట్నించి తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ప్రతీరోజు ఓ హింసాత్మక ఘటనకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రయాణికులున్న ఓ బస్సుపై బాంబుదాడికి తెగబడ్డారు. ఈ ఉదంతంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా పదకొండు మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్స్ అయిన బాద్ఘిస్‌లో జరిగింది ఈ దుర్ఘటన. అయితే, ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు. కాకపోతే ఇది తాలిబన్ల పనేనని బాద్ఘిస్ గవర్నర్ హెసాముద్దీన్ షామ్స్ ఆరోపించారు. బాంబు పేలిన వెంటనే బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని మరో అధికారి నిర్ధారించారు.

కాగా గత వారం రోజుల్లో బస్సులపై వరుసగా బాంబు దాడులు జరుగుతున్నాయి. కాబుల్‌లో ఇటీవల వరుసగా జరిగిన రెండు బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. తాజాగా, ఇప్పుడు మరోమారు ప్రయాణికులే లక్ష్యంగా దాడి జరిగింది. ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య ప్రతి రోజూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా హింస మళ్లీ పెరిగిపోతోంది. కొత్త ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా తాలిబన్లు ముందుకు సాగుతున్నారు. కాబూల్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘజ్ని ప్రావిన్సులోని దే యాక్ జిల్లాను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్లు జూన్ అయిదో తేదీన ప్రకటించారు.

ఇదిలా వుంటే.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ (AFGHANISTAN) వేదికగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన అమెరికా (AMERICA) ఎట్టకేలకు ఆ దేశం నుంచి సైన్యం ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనల (NATO MILITARY FORCES) చివరిదశ ఉపసంహరణ పర్వం మొదలైంది. ఈ ఉపసంహరణ పర్వం వేసవి కాలం ముగిసే సమయానికి పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అమెరికా దళాలు (AMERICAN MILITARY FORCES) సెప్టెంబర్ 11వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో బయటకు వస్తాయని ఇదివరకే ప్రకటించంది. ప్రస్తుతం ఉపసంహరణ ప్రారంభం కాగా ఇందులో అమెరికాకు చెందిన సైనికులు దాదాపు 3500 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. నాటో దళాలకు చెందిన మరో ఏడు వేల మంది సైనికుల ఉపసంహరణ కూడా శనివారమే ప్రారంభమయ్యింది. అమెరికా అధ్యక్షుని (AMERICAN PRESIDENT)గా జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ (JOE BIDEN) ప్రకటించినట్టుగానే నాటో దళాల ఉపసంహరణ మొదలయ్యింది. అయితే ఏప్రిల్ 30వ తేదీన చివరి దశ ఉపసంహరణకు ఒకరోజు ముందే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక సామాగ్రిని తరలించడాన్ని మొదలుపెట్టింది అగ్రరాజ్యం అమెరికా. ఇందుకోసం సీ17 లాంటి భారీ సైనిక కార్గో విమానాలను (MILITARY CARGO FLIGHTS) అమెరికా రంగంలోకి దింపింది.

2001 సెప్టెంబరు 11 వ తేదీన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ (NEW YORK) ట్విన్ టవర్స్‌ (TWIN TOWERS)పైన జరిగిన దాడిలో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అప్పట్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖయిదా (AL-QAIDA) ప్రకటించుకుంది. దానికితోడు అమెరికా మీద మరిన్ని ఇటువంటి దాడులు జరుగుతాయని అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ (OSAMA BIN LADEN) అప్పట్లో ప్రకటించారు. దాంతో అగ్రరాజ్యం అమెరికాకు ఈగో దెబ్బతిన్నది. ఫలితంగా 2011 అక్టోబరు 7వ తేదీన అమెరికా, నాటో దేశాల దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను వెతుక్కుంటూ ఆ తర్వాత క్రమంగా తాలిబన్ల (TALIBAN)ను అంతం చేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత పాకిస్తాన్ (PAKISTAN) భూభాగంలో దాక్కున్న అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికాకు చెందిన నేవీ దళం సీల్ టీమ్ (SEAL TEAM) హతమార్చింది. సుదీర్ఘంగా అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా రకరకాల దాడులకు పాల్పడ్డాయి. వైమానిక దాడులతో అఫ్గనిస్తాన్ పౌరులను హడలెత్తించాయి. ఎక్కడ నలుగురు యువకులు కలిసి వున్నా వారిని ఉగ్రవాదులగా ముద్ర వేసి నాటో దళాలు హతమార్చాయి.

సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లపై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని అమెరికా సైన్యం కానీ, నాటో దళాలు కానీ సాధించలేకపోయాయి. చివరికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన ప్రచార అంశంగా మారింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMP) తాను మళ్లీ గెలిస్తే నుంచి అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. అయితే తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత అధ్యక్షుడు మాత్రం ఉపసంహరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాను అధికారపగ్గాలు చేపట్టిన మూడు నెలల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపసంహరణ మే 1వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీన ముగుస్తుందని  ఆయన స్పష్టం చేశారు.