Apple ipad: విమాన ప్రమాదం నుంచి తండ్రీ కూతుళ్లను కాపాడిన యాపిల్ ఐప్యాడ్.. ఎలాగంటే..
ఇటీవల సింగపూర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిన సంగతి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు సమయానికి సంఘటనా..

ఇటీవల సింగపూర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మోటార్ సైకిలిస్ట్ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిన సంగతి తెలిసిందే. స్మార్ట్ వాచ్ ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రిలో చేర్పించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి పెన్సిల్వేనియాలో జరిగింది. యాపిల్ ఐప్యాడ్ ఇచ్చిన సిగ్నల్ సహాయంతో తండ్రీ కూతుళ్లు విమాన ప్రమదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐ ప్యాడ్ సిగ్నల్స్తో.. పెన్సిల్వేనియాకు చెందిన తండ్రీకూతుళ్లు ఆదివారం టూ సీటర్ ప్లేన్లో బయలుదేరారు. తండ్రి వయసు 58 ఏళ్లు కాగా కూతురు వయసు 13 ఏళ్లు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్ నుంచి సిగ్నల్స్ తెగిపోయాయి. విమానం కనిపించకుండా పోయింది. రాడార్ టీం యునైటెడ్ స్టే్ట్స్ ఎయిర్ఫోర్స్ రెస్క్యూ కో-ఆర్డినేషన్కు సమాచారం అందించింది. వారు 30 మంది వలంటీర్లతో కలిసి విమానం చివరిసారి సిగ్నల్ చూపిన లొకేషన్కు వెళ్లారు. సుమారు 5 గంటల పాటు గాలించినా విమానం జాడను కనుక్కోలేకపోయారు. ఆతర్వాత పైలట్ భార్యను సంప్రదించిన రెస్క్యూ టీం అతని సెల్ఫోన్ నంబర్ను తీసుకుని దానిని పింగ్ చేశారు. అదే సమయంలో కుమార్తె వద్ద యాపిల్ ఐప్యాడ్ ఉందని తెలుసుకుని దానిని కూడా పింగ్ చేశారు. స్మార్ట్ఫోన్ లేదా స్మార్ట్ వాచ్, ఐప్యాడ్లలో ఉండే GPS టెక్నాలజీ సహకారంతో వాటిని పింగ్ చేసి దాని కచ్చితమైన లొకేషన్ను కనుగొనవచ్చు. యూఎస్ రెస్క్యూ టీం అదే పనిచేసింది. యాపిల్ ఐ ప్యాడ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సంఘటనా స్థలానికి వెళ్లిన రెస్క్యూ సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న తండ్రీ కూతుళ్లను గమనించారు. అదృష్టవశాత్తూ వారికి కొద్ది పాటి గాయాలు మాత్రమే తగిలాయి. దీంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా విమాన ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు యునైటెడ్ స్టే్ట్స్ ఎయిర్ఫోర్స్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ బృందం తెలిపింది.
Also read:
China against India: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. బాంబర్ విమానాలతో భారత్కు ప్రత్యక్ష హెచ్చరిక!