అమ్మమ్మపై అపారమైన ప్రేమ.. తులాభారంతో సన్మానం..! బర్దీపూర్ కుటుంబం ఆదర్శం
సోషల్ మీడియాలో వృద్ధులపై దాడులు, తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో, మానవత్వానికి, కుటుంబ బంధాలకు అద్దం పట్టే సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన గూటూరు సుగుణమ్మ కుటుంబ సభ్యులు ఆమెపై ఉన్న మమకారాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఆమె కుమార్తెలు, మనవళ్లు కలిసి సుగుణమ్మకు అత్యంత వైభవంగా తులాభారం నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన మారుతున్న కాలంలో మరుగున పడిపోతున్న కుటుంబ విలువలను, పెద్దలపై గౌరవాన్ని చాటిచెప్పేలా ఉంది. వృద్ధాశ్రమాల సంస్కృతి పెరుగుతున్న ఈ రోజుల్లో, ఒక బామ్మపై మనవళ్లు, మనవరాళ్లు చూపిన ఈ ప్రేమ నిజంగా అందరికీ ఆదర్శప్రాయం. వృద్ధులను భారంగా భావించి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న నేటి సమాజంలో గూటూరు సుగుణమ్మ కుటుంబ సభ్యులు తమ అమ్మమ్మపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. ఆమె కుమార్తెలు, మనవళ్లు కలిసి సుగుణమ్మకు అత్యంత వైభవంగా తులాభారం నిర్వహించారు. నాణేలు, పండ్లు, బెల్లంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆమె నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
సుగుణమ్మ కుమార్తెలు అనిత, శివనాగమ్మ, శశికళ, విశాలాక్షి, వారి సంతానమైన ప్రమోద్ కుమార్, సాయినాథ్, ప్రశాంత్ కుమార్, గోపీకృష్ణ, రితేష్, హారిక, కిరణ్ కుమార్, ఉమా, మహేశ్వరి అందరూ కలిసి తమ అమ్మమ్మకు ఘనంగా తులాభారం నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఆమె బరువుకు సమానంగా నాణేలు, వివిధ రకాల పండ్లు, బెల్లాన్ని తూచారు. తమ పెద్ద దిక్కు అయిన అమ్మమ్మ ఎప్పుడూ సుఖసంతోషాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే కాకుండా, గ్రామమంతా పండుగలా సాగింది. వచ్చిన అతిథులకు, గ్రామస్తులకు భారీ విందు ఏర్పాటు చేయడమే కాకుండా, పీఠాధిపతులను, గ్రామంలోని ఇతర వృద్ధులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. పెద్దల అనుభవం, వారి దీవెనలు కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటాయని ఈ కుటుంబం నిరూపించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.




