Munugode Bypoll: టీఆర్ఎస్ అనుమానించిందే జరిగిందా? ఆ మూడు గుర్తులకు అన్ని ఓట్లు ఎలా వచ్చాయి?
టీఆర్ఎస్ అనుమానించిందే జరిగిందా? కారును పోలిన గుర్తుల విషయంలో ఓటర్లు కన్ప్యూజ్ అయ్యారా? ఈవీఎంలో కొన్ని గుర్తులు తమ మెజారిటీని తగ్గించాయా?
టీఆర్ఎస్ అనుమానించిందే జరిగిందా? కారును పోలిన గుర్తుల విషయంలో ఓటర్లు కన్ప్యూజ్ అయ్యారా? ఈవీఎంలో కొన్ని గుర్తులు తమ మెజారిటీని తగ్గించాయా? ఆ మూడు గుర్తులకు అన్ని ఓట్లు ఎలా వచ్చాయి? మునుగోడు ప్రజలు అంతిమంగా గులాబీకే పట్టం కట్టారు. అన్ని మండలాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఓవరాల్గా 10వేల 309 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల విజయకేతనం ఎగరేశారు. అయితే ఈ ఫలితాల్లో కారును పోలిన గుర్తుల ప్రభావం స్పష్టం కనిపించింది.
చపాతి మేకర్కు 2,407 ఓట్లు..
ఒకసారి ఫైనల్ రిజల్ట్ చూస్తే.. కొంత మంది అభ్యర్ధులకు ఎవరూ ఊహించని ఓట్లు వచ్చాయి. వాటిల్లో ముందుగా చపాతి మేకర్ గుర్తు టాప్లో ఉంది. ఈ గుర్తును శ్రీశైలం యాదవ్కు ఈసీ కేటాయించింది. అతనికి ఏకంగా 2,407 ఓట్లు పోలయ్యాయి.
చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు..
ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో చెప్పుల గుర్తు. ఈ గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్ధి గాలెయ్యకు కేటాయించారు. ఈ సింబల్కు కూడా ఫలితాల్లో 2,270 ఓట్లు వచ్చాయి. ఇక రోడ్ రోలర్ గుర్తుకు 1,874 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తుపై శివకుమార్ అనే అభ్యర్ధి పోటీ చేశారు. ఓవరాల్గా ఈ మూడు గుర్తులకు కలిపి 6,551 ఓట్లు వచ్చాయి.
ఇప్పటివరకూ చెప్పుకున్న సింబల్స్ అన్నీ టీఆర్ఎస్ కారు గుర్తుకు కొంచెం దగ్గరగా ఉంటాయి. ఈ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లలో కొన్ని.. పొరపాటున తమ ఓట్లు పడినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుర్తులు లేకపోయి ఉంటే తమ మెజార్టీ మరింత పెరిగేదని వాదిస్తోంది టీఆర్ఎస్. తమ గుర్తును పోలిన ఓట్లు లేకపోయి ఉంటే తమ అభ్యర్ధి 17 వేలకు పైగా ఓట్లతో గెలిచేవారన్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా మెజార్టీ తగ్గించగలిగారే తప్ప ఓటమిని అడ్డుకోలేకపోయారన్నారు.
గుర్తుల కేటాయింపు జరిగిన దగ్గర నుంచీ ఈ అంశంపై పెద్ద వివాదమే నడిచింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించిన కొన్ని గుర్తులపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చపాతీ మేకర్, రోడ్ రోలర్, చెప్పులు, డోలీ, కెమెరా, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులపై టీఆర్ఎస్ అబ్జెక్షన్ చెప్పింది. వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ.. కోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. ఇదే అంశంపై ఢిల్లీలో CECకి ఎంపీ వినోద్ ఫిర్యాదు చేశారు. కానీ సానుకూల స్పందన రాలేదు. ఫైనల్గా ఆ గుర్తులు బ్యాలెట్లో అలాగే ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నట్టుగానే వాటిల్లో కొన్ని గుర్తులకు ఎవరూ ఊహించని ఓట్లు వచ్చాయి. ఈ గుర్తులు కొన్ని అధికార పార్టీ ఓట్లను డైవర్ట్ చేసినట్టుగానే కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..