Amit Shah Tour: తెలంగాణపై కమలం గురి.. సెప్టెంబర్ 17న రాష్ట్రానికి అమిత్ షా.. నిర్మల్లో భారీ బహిరంగ సభ..?
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.
Amit Shah Telangana Tour: తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.. ఇక, పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణపై కూడా దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ లో పర్యటించ బోతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రం లో పర్యటిస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా అమిత్ షా నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. నిర్మల్ జిల్లా నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా , రజాకార్లను ఎదురొడ్డి పోరాడి 1000మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందుకే వారిని స్మరించుకునేందుకు నిర్మల్లోనే అమిత్ షా అక్కడే సభను ఏర్పాటు చేసే అలోచనలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, వచ్చే ఎన్నికల నాటికీ తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రను చేపట్టగా.. మరోవైపు, బండి సంజయ్ కూడా పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర హోం మంత్రి సైతం పర్యటన కు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 17న తెలంగాణలో పర్యటిస్తారని చెబుతున్న బీజేపీ వర్గాలు.. అమిత్ షా తెలంగాణ పర్యటనపై రెండ్రోజుల్లో రాష్ట్ర నాయకత్వంతో అధిష్ఠానం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం అమిత్ షా పర్యటనపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డికి చేరుకోనుంది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్. బీజేపీ అధికారంలోకొస్తే శక్తివంతమైన తెలంగాణను నిర్మిస్తామన్నారు. 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే నిర్మల్ సభతో పాటు కామారెడ్డి సభకు అమిత్ షా హాజరయ్యేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలి నిర్ణయించారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ప్రజా సమస్యల కోసం వీధి పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు.