Harish Rao: మంత్రిగా పేదల కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే ఏం చేస్తారు.. సూటిగా ప్రశ్నించిన మంత్రి హరీష్
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రచార పర్వంలో నేతలు బిజీ అయిపోయారు.
Huzurabad by Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రచార పర్వంలో నేతలు బిజీ అయిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును భుజాన వేసుకున్న మంత్రి హరీష్ రావు.. పల్లె పల్లెలో పర్యటిస్తున్నారు. ప్రతీ రోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో తిరగుతూ.. టీఆర్ఎస్కు ప్రజల మద్దతు కూడగడుతున్నారు. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేతలను బలపరుస్తామంటూ ముందుకు వస్తున్నారు.
మరోవైపు, మంత్రి హరీశ్ రావు, మాజీమంత్రి ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కాగా, తన స్వార్థంకోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఉప ఎన్నిక వచ్చిందన్న హరీష్.. మంత్రిగా పేదల కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఇళ్లు నిర్మించి ఇస్తారా అని ప్రశ్నించారు. వ్యక్తి ప్రయోజనమా…హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలా… ఆలోచించి ఎన్నికోవాలన్నారు. నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎంకు హుజూరాబాద్ గెలుపు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు హరీష్.
శనివారం ఉదయం వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు కుల సంఘాలు, గ్రామ ఉప సర్పంచ్ నల్ల సత్యనారాయణ రెడ్డి ఆధ్యర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం నేతలు కూడా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఈ రెండు గ్రామాల నుంచి దాదాపు 150 మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పిన హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.
అన్ని వర్గాల ప్రజలు సంతోషం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషీ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కులవృత్తులను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. గొల్ల కురుమలకు గొర్రెలు మత్స్యకారులలకు చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ముఖ్యంగా రైతుకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి పంపిణీ చేసి రైతును రాజుగా మార్చామని మంత్రి హరీష్ స్పష్టం చేశారు.
ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు. నేటి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని గుర్తు చేశారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండించే పంజాబ్ను వెనక్కు నెట్టి, తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. యాసంగిలో 3 కోట్ల మెట్రిక్టన్నులవరి పంట పండించి తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు, తాగు నీటికొరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజూరాబాద్ అన్నారు.