Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. స్కామ్‌లో ఆ మంత్రి పీఏ హస్తం ఉందంటూ..

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌లో మంత్రి కేటీఆర్‌ పీఏ హస్తం ఉందంటూ ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి సొంత గ్రామం కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రూప్‌-1 పరీక్షలో 100 మందికి పైగా 100 మార్కులు రావడమే దీనికి నిదర్శనమన్నారు.

Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. స్కామ్‌లో ఆ మంత్రి పీఏ హస్తం ఉందంటూ..
Revanth Reddy
Follow us

|

Updated on: Mar 18, 2023 | 6:06 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌లో మంత్రి కేటీఆర్‌ పీఏ హస్తం ఉందంటూ ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి సొంత గ్రామం కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రూప్‌-1 పరీక్షలో 100 మందికి పైగా 100 మార్కులు రావడమే దీనికి నిదర్శనమన్నారు. శనివారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రేవంత్‌ రెడ్డి .. ‘ సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్ పేరుతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్. కాంగ్రెస్ కష్టపడి పారదర్శక విధానం తెస్తే… కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేశారు. తెలంగాణలో అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి ఆయనే. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకేజీ ఇష్యులో మొదట హానీ ట్రాప్ అని, రెండోసారి హాకింగ్ జరిగిందని చెప్పారు. తరువాత లీకయిందని చెప్పారు. నిజాలు బయటకు వస్తుండటంతో పరీక్షలను రద్దు చేశారు. లీకేజీ ఇష్యులో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని బీఆర్‌ఎస్‌ చెబుతోంది. మరోవైపు ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా అంటూ కేటీఆర్ తోండి వాదనకు దిగుతున్నారు. రెండో ముద్దాయి బీఆర్‌ఎస్ వాళ్లని బీజేపీ చెబుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు. ఇదే మొదటిసారి జరిగినట్లు మంత్రి మాట్లాడుతున్నారు. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేసేందుకు జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయింది. కవితకు కూడా అందులో భాగస్వామ్యం ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకైంది. దీనివల్ల మూడు సార్లు అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చింది’

గతంలోనూ పేపర్ లీక్స్..

‘ఇక 2017 మరోసారి సింగరేణి నియామకాల్లో ప్రశ్నాపత్రం లీకైంది. 2019లో ఇంటర్ మూల్యాంకణం లోపభూయిష్టంగా జరిగింది. 60వేల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ మూల్యాంకనం అప్పగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబరీనా విషయంపై ప్రశ్నించిన మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ దాడులు చేయించి జైల్లో పెట్టారు. రద్దు చేయడం కూడా గొప్పతనం అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు.155 నోటిఫికేషన్లు 37వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని గతంలో కేటీఆర్ చెప్పింది అబద్ధమని ఒప్పుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలన్నింటిపై విచారణ చేయాలి. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నారు. ఐటీ మంత్రికి సంబంధం లేనపుడు కేటీఆర్ సీఎం రివ్యూలో ఎందుకు కూర్చున్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడకుండా.. కేటీఆర్ ఎందుకు మాట్లాడారు? విచారణ అధికారులను, సిట్ అధికారులు, మంత్రి వర్గాన్ని సమావేశానికి ఎందుకు పిలువలేదు? కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు లీకేజ్ ఇష్యులో అరెస్ట్ చేసిన 9 మందిని విచారణ చేయలేదు. ఇద్దరు వ్యక్తులే నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా ప్రకటిస్తారు? బీఆర్‌ఎస్‌ లో ఉన్న పెద్ద తలల్ని కేటీఆర్ కాపాడారు. అధికారులపై ఒత్తిడి చేయడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారా? రాజశేఖర్, ప్రవీణ్ పెద్దలకు తెలియకుండానే వ్యవహారం నడిపారా? ఇంటి దొంగలు బయటపడతారనే కేటీఆర్ హడావుడిగా బయటకు వచ్చారు. ఈ తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ బాధ్యత వహించాలి. కేసును పూర్తిగా నీరుగార్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును సీబీఐ తో విచారణ చేయించాలి. సీబీఐ పై నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి’

రేపు నిరసన దీక్ష..

‘ ఈ వ్యవహారంపై రేపు ఎల్లారెడ్డిలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యో నిరసన దీక్ష చేస్తాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష ఉంటుంది. కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలి. 21న గవర్నర్ ను కలిసి పరిణామాలను వివరిస్తాం. కేటీఆర్ పీఏ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మల్యాల మండలానికి చెందిన వంద మందికి గ్రూప్-1లో 100కుపైగా మార్కులు వచ్చాయి. దీనిపైన కూడా పూర్తి విచారణ చేయాలి. సిరిసిల్ల నిరుద్యోగి చనిపోతే సానుభూతి తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆ కుటుంబాన్ని బెదిరించి దహన సంస్కారాలు పూర్తి చేయించారు. కన్నకొడుకు మరణిస్తే ఏడ్చే అవకాశం కల్పించలేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..