Telangana – Harish Rao: తెలంగాణ మంత్రులనే అవమానిస్తారా?.. కేంద్రమంత్రి దుమ్ము దులిపిన హరీష్ రావు..

Telangana - Harish Rao: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana - Harish Rao: తెలంగాణ మంత్రులనే అవమానిస్తారా?.. కేంద్రమంత్రి దుమ్ము దులిపిన హరీష్ రావు..
Harish Rao
Follow us

|

Updated on: Dec 22, 2021 | 1:12 PM

Telangana – Harish Rao: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఆయన.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. బుధవారం నాడు టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఫైర్ అయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున, 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చిన మంత్రులను.. “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే కన్నెర్రజేశారు. పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించు కావాలని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారిన ద్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా? అంటూ కేంద్ర మంత్రి వైఖరిని తూర్పారబట్టారు. ‘‘కేంద్ర మంత్రిగా ప్రజాప్రతినిధులను కలుస్తవా? లేక మీ పార్టీ నాయకులనుకలుస్తావా? మీ ప్రాధాన్యం ఏంటి?’’ అని మంత్రి హరీష్ రావు దుమ్ము దులిపేశారు.

అబద్ధాలు, అసత్యాలు మీవి.. ‘‘అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అభాండాలు, గోబెల్స్ ప్రచారంతో రాజకీయం చేసింది నువ్వు. మీ ప్రాధాన్యం రాజకీయం. మా ప్రాధాన్యం రైతులు. ధాన్యం కొంటారా? కొనరా? చెప్పండి అని మంత్రుల బృందం వస్తే.. కలవడానికి సమయం లేదు అంటారా?. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు. వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా?. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి?.’’ అని కేంద్ర మంత్రి తీరును చీల్చిచెండాడారు మంత్రి హరీష్ రావు.

టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. ‘‘తెలంగాణ మంత్రులను అవమానించే హక్కు నీకు ఎక్కడిది? తెలంగాణ ప్రజలను, రైతులను, అవమనించడం హేయమైన చర్య. ఇంతకంటే దారుణం ఏం ఉండదు. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. అందుకే ఢిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు. మాట మార్చింది మీరు. మళ్ళీ మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతం మీది. ఎవరు రాజకీయం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా?.. బీజేపీ కుటిల నీతికి ఇది నిదర్శనం. తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమాన పరిచే హక్కు మీకు లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని మేము అంటున్నాం. పంజాబ్‌లో మొత్తం కొంటున్నట్లే.. మా దగ్గర కొనాలి అంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా.. డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు.’’ అంటూ ఫైర్ అయ్యార హరీష్ రావు.

మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం.. మీ సంగతేంటి?.. ‘‘విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. గోదాములు కట్టాం, మార్కెట్లు అభివృద్ధి చేశాం. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నాం. పంటల కొనుగోళ్ళు కేంద్రం పరిధిలో ఉంది. మీరు మీ బాధ్యతను విస్మరించారు. చేతకాకపోతే రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేయండి. మావల్ల కాదు అని మీరు చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెబుతారు. మీ బాధ్యత మీరు నిర్వర్తించరు. మా మంత్రులను అవమనిస్తారు.’’ అని కేంద్రం తీరును ఎండగట్టారు మంత్రి హరీష్ రావు.

చంపడమే రైతుపై మీకున్న గౌరవం.. పట్టపగలు రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన కేంద్ర మంత్రి కొడుకును సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రైతులపై మీకున్న గౌరవం అది అని కేంద్రం తీరును విమర్శించారు. వరుస ఓటములు ఎదురవుతున్నా.. గర్వం తగ్గడం లేదని, ప్రజలే తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.

‘‘వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడరు. వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడరు. ఇంకా పైగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పోయిన వానా కాలం యాసంగి బియ్యమే ఇంకా ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. వ్యాగన్లు, గోదాములు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు చెప్తే.. “మీరు ఒక్క లేఖ అయినా రాశారా” అని కేంద్రమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఒకటి కాదు పది లేఖలు రాశాం. మేము బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్ పర్సన్ ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో అని చెప్తే పట్టించుకోలేదు. పైగా డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారు. చెత్త చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా దొంగే దొంగ దొంగ అన్నట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము నిన్ను అడుక్కోవడానికో.. బిచ్చం ఎత్తుకోవడానికో రాలేదు. మీ బాధ్యతను గుర్తు చేసేందుకు వచ్చాం. అంతమాత్రాన చిన్న చూపు చూస్తారా. మమ్మల్ని అవమానిస్తే పడతాం.. కానీ రైతులను అంటే ఎట్టిపరిస్థితిలో ఊరుకోం. దేశంలో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వమే వడ్లు కొనడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ధాన్యం కొన్నది. ఇప్పుడు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారు. రైతుల జీవితాలతో ఆడుకుటున్నారు.’’ అని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

వడ్లు కొంటరా? కొనరా? ఒక్క మాట చెప్పండి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి రైతులను ఆదుకుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆడుకుంటోందని మంత్రి హరీష్ దుయ్యబట్టారు. నోటి తో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు వ్యహరిస్తోందన్నారు. బియ్యం రవాణా ఆలస్యం అవుతుందని తన దృష్టికి వస్తె.. తానే ఉమ్మడి జిల్లా మంత్రిగా గతంలో FCI జనరల్ మేనేజర్ ను ఇంటికి పిలిచాననని అన్నారు. టిఫిన్ పెట్టి 2 గంటలు బతిలాడానని, కలెక్టర్లు, అధికారులు, మిల్లర్లు తమ సమస్యలు చెప్పారని అన్నారు. ఎలాగైనా పైవాళ్ళతో మాట్లాడి బియ్యం తరలించమని ఎఫ్‌సిఐ మేనేజర్‌ను కోరానన్నారు. దానికి ఆయన రైల్వే వాళ్ళు బీహార్ కు వ్యగన్లు ఇచ్చారు గానీ తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పారన్నారు. తాను వెంటనే సీఎస్ సోమేష్ కుమార్ కు చెప్పి రైల్వే వాళ్ళ తో మాట్లాడించానని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Also read:

Hair Care: జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి..

Aadhaar Update: ఆధార్‌లో మీ పుట్టిన తేదీ తప్పుగా ఉందా..? మార్చుకోండిలా..!

Dog Bite: కరిచింది కుక్కే కదా అని కారంపొడి పెట్టుకుని పడుకోవద్దు.. డాక్టర్ వద్దకు వెళ్ళకపోతే ఇంతే సంగతులు!