AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallu Swarajyam: భూస్వాముల కుటుంబాల్లో పుట్టినా.. పేదల పక్షాన 16 ఏళ్లకే తుపాకీ పట్టిన తెలంగాణ వీరనారి

తెలుగు రాజకీయాలు, సామాజిక రంగాల్లో మల్లు స్వరాజ్యం (Mallu swarajyam) అనే పేరు అందరికీ తెలిసిందే. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలిగా, తెలంగాణ సాయుధ యోధురాలిగా అందరికీ సుపరిచితమే. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన...

Mallu Swarajyam: భూస్వాముల కుటుంబాల్లో పుట్టినా.. పేదల పక్షాన 16 ఏళ్లకే తుపాకీ పట్టిన తెలంగాణ వీరనారి
Mallu
Ganesh Mudavath
|

Updated on: Mar 21, 2022 | 12:39 PM

Share

తెలుగు రాజకీయాలు, సామాజిక రంగాల్లో మల్లు స్వరాజ్యం (Mallu swarajyam) అనే పేరు అందరికీ తెలిసిందే. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలిగా, తెలంగాణ సాయుధ యోధురాలిగా అందరికీ సుపరిచితమే. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన స్వరాజ్యం.. చిన్న తనంలోనే మాగ్జిం గోర్కీ ‘అమ్మ’ నవల ప్రేరణతో సామాజిక దురాచారాలపై పిడికిలి బిగించారు. నిజాం పాలనలో దొరలకు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా భూమికోసం, భుక్తికోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి నల్గొండ (Nalgonda District) జిల్లాలోని కర్విరాల కొత్తగూడెంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. 1931లో భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆమె చదివింది ఐదో తరగతి వరకే. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి (Mallu Venkata Narasimha Reddy) అడుగుజాడల్లో నడుస్తూ పోరాట మార్గంలో అలుపెరగని పయనం చేశారు. 1941లో తొలిసారిగా ఆంధ్రమహాసభ పిలుపుతో తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం నిరుపేద కుటుంబాలకు పంచిపెట్టారామె. ఆనాటి సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా పీడిత ప్రజలకు మద్దతుగా నిలిచే విషయంలో తన తల్లి భీమిరెడ్డి చొక్కమ్మ అండగా నిలబడ్డారు.

పట్టిస్తే జరిమానా..

తెలంగాణ సాయుధపోరాటంలో తుపాకీ చేతబట్టిన మల్లు స్వరాజ్యం ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. ప్రజలను కదిలించేలా సభలు, సమావేశాలు నిర్వహించారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. నిజాం పాలనకు, ఫ్యూడల్ దొరతనానికి పక్కలో బల్లెంలా ఉన్న మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలపై ఆగ్రహంతో రజాకార్ మూకలు 1947లో మల్లు స్వరాజ్యం ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. అదే సమయంలో అజ్ఞాతంలో ఉన్న స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ.10వేలు నజరానాను నిజాం ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికీ ఆమె వయస్సు 18 ఏళ్లే కావడం గమనార్హం.

పిస్టోల్ గురిపెట్టినా సడలని ధైర్యం..

ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న నాగారంలో ఆనాటి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ వారు ఓటర్లలో భయాందోళనలు సృష్టిస్తుంటే తను అక్కడికి చేరుకున్నారు. ఆమెతో ఆనాటి అధికార పార్టీకి చెందిన ఓ నేత వాగ్వాదానికి దిగారు. తన పిస్టల్ గురిపెట్టి బెదిరించబోయారు. ఈ హఠాత్పరిణామానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఆమె ఏ మాత్రం భయపడకుండా ‘కాల్చుతావా, కాల్చు…’ అంటూ ఎదురు నిలిచారు. దీంతో ఆ నేత వెనక్కి తగ్గక తప్పలేదు. సాయుధ పోరాటం విరమణ తర్వాత కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆమెకు దొరలతో పోరాటం తప్పలేదు. పేద రైతులు, కూలీల పక్షాన నల్లగొండ జిల్లాలోని భూస్వామ్య శక్తులు, దొరల రాజకీయాలకు అరాచకాలకు ఎదురొడ్డి నిరంతరం పోరాడాల్సిన పరిస్థితులను మల్లు స్వరాజ్యం ఎదుర్కొన్నారు. పీడిత ప్రజల మీద ఏ ప్రాంతంలో దాడులు దౌర్జన్యాలు జరిగినా, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బాధితుల పక్షాన స్వరాజ్యం నిలబడ్డారు.

నిరంతరం ప్రజల కోసమే..

పదహారేళ్ల ప్రాయంలోనే సాయుధ పోరాట పంథాలో అడుగుపెట్టినప్పట్నుంచి 91ఏళ్ల వయోభారంలోనూ నిరంతరం ఆమె ప్రజల కోసమే పనిచేశారు. పార్టీ సభలు, సమావేశాల్లో వాడీ వేడిగా సాగే ఆమె ప్రసంగాలను అందరూ ఆసక్తిగా ఆలకించేవారు. మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి అనారోగ్యంతోనే 2004, డిసెంబర్ 25న మృతి చెందారు.

Also Read

Russia Ukraine War: సైనిక స్థావరమే లక్ష్యంగా రష్యా దాడి.. 50 మందికి పైగా ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది మృతి

Viral Video: అమ్మో ‘డైనోసార్’ చేప.. మరీ ఇంత పెద్ద చేపను మీ జీవితంలో చూసుండరు.. షాకింగ్ వీడియో మీకోసం..!

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్